పుట:Konangi by Adavi Bapiraju.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బి. య్యే. పరీక్షలో మొదటి తరగతిలో నెగ్గిన బాలకునకు ఉద్యోగం సంపాదించడం అంత బ్రహ్మవిద్య కాదు. కాని అతనిలో అవ్యక్తంగా ఏదో లోకాన్ని అతివేగంగా అధిగమించే వేదనాభరిత కాంక్ష బయలుదేరింది.

అతని చేతిలో తన మనస్సు తాను చూచుకునే దుర్బిణియంత్రమే ఉంటే, తన్నీ రోజులలో పొదివికొన్న ఆవేదన అర్థమయ్యే ఉండును.

ప్రపంచం అంతా అతనికి లోపభూయిష్టంగా కనబడేది. అతని చూపు వెనక్కులేదు. “ఇప్పటి' పైనే ఎక్కువగా ఉంది. ఆ 'ఇప్పటి’ లో ఉన్న అపశ్రుతులన్నీ అతని మనోనేత్రాలకు వికారాలుగా తోస్తూ ఉన్నవి. అతనికి నవ్వూ, కోపమూ రెండూ ఒక్కసారిగా వచ్చేవి. అతని కోపం నవ్వుతో మిశ్రమై, నిశితమైన అపహాసంగా ఉద్భవించింది.

ఇప్పటిలోని సంఘపథకం అతనికి ముందుగా కనబడుతూ ఉంటుంది. మిస్ మేయో రాసిందంటే రాయదూ! ఆవిడ ఇంకా గౌరవంగా “మదర్ ఇండియా” అని రాసి ఊరుకుంది. “ఏ పూర్ ఇండియా' అనో రాయలేదు. “ఏ డర్టీ ఇండియా" అనో వ్రాయలేదు. అది నయంకాదుటండీ అనుకున్నాడు. వైటువే కంపెనీ మేనేజరుగారి దగ్గర ఆ “మదర్ ఇండియా” పుస్తకం చూచి చదువుకునేందుకు తీసికొని, చదివి ఇచ్చేశాడు. పరీక్షలలో మొదటి తరగతులలో నెగ్గే ఘటమాయను. ఆ ఒక్కసారి చదువులో ఆ గ్రంథం యావత్తూ పూర్తిగా కంఠతః వచ్చింది.

పుస్తకం చదవగానే మొదట అతనికి కోపం వచ్చింది. తర్వాత దుఃఖం వచ్చింది. వెంటనే నవ్వు వచ్చింది. అవును ఆ ముసలావిడకు భరతదేశం కోడలై కనిపించింది. అమెరికావారు భారతదేశీయపు మురుగు కాల్వలన్నీ టెలిస్కోపులో చూడాలని ఇంగ్లీషువారు ఆమెచేత ఈపుస్తకం రాయించారని ఆనాడు గగ్గోలు పుట్టిన మాట నిజం.

మొత్తంమీద మేయో భారతజాతిలో ఉన్న కోటికళంకాలన్నీ వెదికి ఏరి మాలిక అల్లి ఆనందించండర్రా అని తన దేశస్తుల మేళ్ళలో వేసిందా దేయ్యపుదండను.

ఆ పుస్తకం ఎప్పుడు చదివాడో, ఆ వెంటనే దానికి జవాబుగా వచ్చిన నాలుగు పుస్తకాలూ చదివాడు. రంగయ్యంగారి “పాదర్ ఇండియా” లాలాలజపతిరాయిగారి “అన్ హాపీ ఇండియా”, ఎర్నెష్ణువుడ్ గారి “యాన్ ఇంగ్లీష్ మాన్సు రిప్లయ్ టు మదర్ ఇండియా”, గాబాగారి “అంకుల్ షామ్” అనే పుస్తకాలు చదివాడు.

ఇన్ని పుస్తకాలు చదవడానికి అనంతలక్ష్మి దర్శనమే కారణం కోనంగిరావుకి. ఇంకా ఆఖరు పుస్తకం రెండోసారి చదువుతున్నాడు. ఈ పుస్తకాలన్నీ అనంతలక్ష్మి తండ్రిగారి పుస్తకాగారంలోనివి.

ఈ అయిదు పుస్తకాలూ చదివేటప్పటికి ఆ కాలంలోని అన్ని విషయాలు విచారణకు వచ్చాయి కోనంగి మనస్సులో.

హెూటలు గుజరాత్ నుండి తిన్నగా నెల్లూరు హెూటలుకుపోయి చేరిన రెండు రోజులవరకూ ఎక్కడికీ కదలలేదు కోనంగి. మూడవ రోజున సాయంకాలం అనంతలక్ష్మి ఇంటికి పాఠానికి వెళ్ళాడు.

కోనంగిని చూడగానే అనంతలక్ష్మికి కలిగిన ఆనందం ఏ రాయప్రోలో, దేవులపల్లో, వేదులో, నండూరో, విశ్వనాధ్, శివశంకరులో, కాటూరో, పింగళులో వర్ణించవలసిందే.

“నిన్నా మొన్నా రాలేదేమండీ గురువుగారూ?”

“కొంచెం ఒంట్లో బాగుండక రాలేదు.”