పుట:Konangi by Adavi Bapiraju.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తమ కుటుంబ వైద్యునిగా చేసుకున్నారు. అలా చేసుకొనడానికి ఒక ముఖ్యకారణం వుంది. అయ్యంగారు కారులో ఓ సాయంకాలం బీచికి వెడుతూ ఉన్న సమయంలో లజ్ మూల కొంచెం పనివుండి ఆగి, మళ్ళీ కారెక్కి వెళ్ళబోయే సమయంలో, తలుపుమూస్తూ ఉంటే చేతివేలు నలిగింది.

ఎదురుగుండా రెడ్డిగారి వైద్యాలయం ఉంది. అందులోకి అయ్యంగారు పరుగెత్తి చేతికి కట్టుకట్టించుకున్నారు. అప్పుడు అయ్యంగారికి రెడ్డిగారంటే చాలా మంచి అభిప్రాయం కుదిరింది. అనాటి నుంచి రెడ్డిగారు అయ్యంగారి కుటుంబ వైద్యులయ్యారు.

3

డాక్టరు రంగనాయకులరెడ్డి ముఖ్యంగా మూలకారణవాది. కారణం లేకుండా కార్యం జరగదంటాడు. అందుకనే చెట్టియారుగారు తనకు పదివేలరూపాయల ఫీజు ఇవ్వడానికి సిద్దం అయ్యాడే, అందుకు మహత్తర కారణం వెంటనే అర్థం చేసుకున్నాడు. డాక్టరు రెడ్డికి ప్రేమ అంటే నమ్మకంలేదు. స్త్రీ పురుష సంబంధం ఒక ప్రకృతి న్యాయమని ఆయన వాదన. పురుషునికి స్త్రీ కావాలి, స్త్రీకి పురుషుడు కావాలి. స్త్రీపురుషులు జాతి వృద్ధికోసం కలుసుకుంటారు. ఆ తర్వాత ఒకరికొకరికి సంబంధంలేదు.

ఈ బిడ్డలను కనవలసింది, పెంచవలసింది తల్లి. బలంకలిగిన మనుష్యుడు ఆంబోతు వంటివాడు కాబట్టి ఇరవై ముప్పదిమంది స్త్రీలను తన జట్టులో ఉంచుకొనేవాడు. ఇప్పటి కోతుల కుటుంబాలలో, అడవి ఏనుగులు, లేళ్ళు అంతేగాదా? ఆడవాళ్ళకు పురుష సంపర్కానికి కాలం, స్థలం కావాలి. పురుషులకు అదీలేదు ఇదీలేదు.

ఇంకప్రేమ ఎక్కడ వుంది? అది మనుష్యునిలోని నీరసత్వము. చరిత్ర ప్రవాహంలో మానవసంఘం చక్కగా నడవడానికి వివాహం అనే సంస్థను ఉద్భవింప చేసుకొన్నారు మనుష్యులు. దానివల్లనే ప్రేమ అనే కొత్తభావం వచ్చింది. విషయాలు తెలిసి ఉన్న వైద్యులు ఈ ప్రేమభావం ఎల్లా ఒప్పుకుంటారు? స్త్రీ పురుషులు ఒకరి నొకరు వాంఛించడం ఒక విధమైన నరముల పొంగువలన కలుగుతుంది. ఆది ప్రేమ ఎలా అవుతుందని ఆయన వాదిస్తాడు.

కాస్త శాస్త్రజ్ఞానం అబ్బిన దేశాల్లో వ్యభిచారం ఎక్కువ అవడానికి కారణం ప్రపంచాన్ని సరియైన విధానంగా అర్థం చేసుకోవడమే. పెళ్ళి స్త్రీ పురుషుల సంబంధాన్ని, రైలుపట్టా ఎక్కించడం వంటిది అని ఆయనవాదం. అందుకనే రెడ్డిగారు వివాహం చేసుకోలేదు. అనేకమంది పెద్దలు, బాలికలు ఆయన మనస్సు తిప్పుదామని ప్రయత్నం చేశారు. కాని లాభం లేకపోయింది.

డాక్టరు రెడ్డిగారు కోనంగి అంటే ఎంతో ఆనందం పొందినాడు. చెట్టియారుగారు లక్ష రూపాయలిస్తే మాత్రం కోనంగి భయంకర రోగపీడితుడని తాను చెప్పగలడా! ఈలాంటి దొంగసొమ్ము మైలుదూరంలో ఏభైఅడుగుల లోతు కలిగిన నూతిలో పడవేయాలి అని అనుకున్నాడు.

డాక్టరు రెడ్డిగారు కోనంగిని చూడ్డానికి వెళ్ళాడు. కోనంగి కులాసాగా ఉన్నాడు. పధ్యం వంటపడుతూ ఉంది. డాక్టరు ధర్మం, అధర్మము అనేవి మత విషయికములంటే నమ్మడు. శాస్త్రరీత్యా ప్రపంచం ఒకదానితో ఒకటి శ్రుతిగా సంబంధం కలిగిన న్యాయాలతో ధర్మాలతో నిండి వుండాలి. అంతవరకూ తాను ధర్మవాదే అని అనుకుంటూ కోనంగిని “ఏమండీ ఎవ్వరనుకుంటారు మిమ్మల్ని ఎత్తుకు పోయింది?” అని ప్రశ్నవేశాడు.