పుట:Konangi by Adavi Bapiraju.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టరు: ఎందుకూ?

చెట్టి: నా ఉద్దేశం చెప్తాను. కోనంగిరావు అనంతలక్ష్మిపై కన్నువేశాడు. వాడు వట్టి లోఫర్. బి.య్యే. అయితే సరేనా మరి, గుణాలు ఉండాలి. ఇంతకూ వాడు ముండల ముఠా కోరు. నేను అనంతలక్ష్మిని పెళ్ళి చేసుకోదలచుకున్నాను. కోనంగి విషయంలో ఆ అమ్మా యి...

డాక్టరు: కొంచెం సదభిప్రాయంతో ఉందని మీ ఉద్దేశం?

చెట్టి: అవునండి. మీరు కోనంగికి వైద్యం చేస్తున్నారు. అతనికి సుఖవ్యాధులు ఉండకూడదా?

డాక్టరు: అలాంటివి యేవీ లేవని నేను నిర్ధారణగా చెప్పగలను.

చెట్టి: ఆమ, ఆమ. మీరు చెప్పింది నిజమే! కాని అనంతలక్ష్మిలో అనురాగరోగం కుదర్చాలి మీరు. నేను పదివేలు ఫీజు ఇచ్చుకో గలను.

డాక్టరు: అంత పెద్దజబ్బా అనురాగరోగం! రోగం సంగతి అంతా ఆలోచించి తర్వాత చెప్తానులెండి.

చెట్టియారుగారు సంతోషిస్తూ వెళ్ళిపోయారు.

డాక్టరు రంగనాయకులు రష్యాప్రియుడు, కమ్యూనిస్టువాది. కాంగ్రెసులో పనిచేసి చేసి దేశంలో ఉన్న శక్తులను కాంగ్రెసు కట్టుకు రాలేకపోతున్నదని, అహింసా వాదమువల్ల ఎదుటివాడి హృదయం మార్చడం అనే ఆశయం ఉద్భవం అవుతుందనీ, ఈలోగా తిండిలేక మాడిపోతూ ఉంటారు ప్రజలు అనీ నిర్దారణచేసుకున్నాడు. ఆచార్య నరేంద్రదేవు, జోషీ, జయప్రకాష్ మొదలగువారి వాదనలు వచ్చాయి. ఆ రోజుల్లో కాంగ్రెసు ఎడమ చేతి వాదన వారుండేవారు. వారు కాంగ్రెసు సోషలిస్టులు, కమ్యూనిస్టులు, అనీ.

జోషి మీరట్ కేసులో ఉన్నాడు జైలుకు వెళ్ళాడు. ఆ సందర్భంలోనే ఆ తర్వాతనే జోషి, డాంగే మొదలగువారు కమ్యూనిస్టులుగా ఉండి రహస్యంగా సామ్యవాదాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. వారిలో చాలామంది కాంగ్రెసు సభ్యులే.

ప్రభుత్వం కమ్యూనిస్టు సంఘాలను నిషేధించింది. ఆ కారణంచేత కమ్యూనిస్టులు కాంగ్రెసులోనే ఉండి పనిచేస్తూ వుండిరి.

జయప్రకాష్ నారాయణ్, మెహరల్లీ, పుచ్చలపల్లి సుందరయ్య మొదలైనవారంతా కాంగ్రెస్లో సోషలిస్టులుగా (సాంఘికవాదులుగా) ఉండేవారు.

డాక్టరు వీరి వ్రాతలు చదివేవాడు. బోలివిజంను గురించి చదివేవాడు. 1928లోనే పరీక్ష పూర్తిచేసి, 1930లో మదరాసులో ప్రాక్టీసు ప్రారంభించాడు. డాక్టరుగారికి మొదటనుంచీ చక్కని కాతాలు ఏర్పడి మంచి హస్తవాసి అనిన్నీ, దిట్టమైన వైద్యుడు అనిన్నీ పేరుపొందాడు. 1930లో కాంగ్రెసు సత్యాగ్రహం ప్రారంభించింది. 1931 తిరిగి వచ్చింది. మళ్ళీ 1932 కాంగ్రెసువారి నందరినీ కారాగారాలలో బంధించారు. కాని చాలా మందిని ప్రభుత్వంవారు లాఠీ ప్రయోగంచేసి మాత్రం వదులుతూ ఉండేవారు.

అలాంటివారి కందరికీ ఆ రెండవ సత్యాగ్రహంలో డాక్టరుగారు వైద్యం చేసేవారు. కాంగ్రెసు శిబిరానికి వైద్యులయ్యారు. అందుచేత ప్రభుత్వంవారు డాక్టరుగారిని కూడా కారాగారవాసానికి పంపినారు. 1934లో అందరితోపాటు ఆయనా బయటికి వచ్చాడు. మరీ పెద్ద వైద్యుడై, నేలకు సునాయాసంగా పన్నెండు వందలవరకూ తెచ్చుకుంటున్నాడు.

కాంగ్రెసు ప్రభుత్వకాలంలో జనరల్ ఆస్పత్రికి గౌరవ వైద్యుడయ్యాడు.

డాక్టరు రెడ్డి వైద్యం ప్రారంభించినప్పటి నుంచీ శ్రీరంగయ్యంగారు రెడ్డిగారిని