పుట:Konangi by Adavi Bapiraju.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనంతలక్ష్మికి తానుతప్ప కన్యరికం చేయగల శక్తిగలవాళ్ళు ఎవరు” అని లోపల ఊహించుకొనేవాడు. కాని కథ అడ్డం తిరిగింది.

అనంతలక్ష్మి దేహంలో మనస్సులో నిర్మలత్వం ఉంది. రఘునాధరాయని హృదయ మహారాజ్యం ఆక్రమించి, చక్రవర్తియై రాజ్యమేలిన దివ్యసుందరి, భూమికి దిగివచ్చిన పరమాప్పరస సుందరి మధురవాణి అందమంతా ఈ బాలికలో ప్రత్యక్షమైంది. కొంచెం కోల, కొంచెం గుండ్రని మోము, అయిదడుగుల ఎత్తు, పొట్టి పొడుగుకాని ముక్కు సమమైన కోలతనంలో దవడలో, బుగ్గలు ఫాలము ఏకరేఖా ప్రవాహ సామ్యం కుదిరి వుంటాయి. అలాంటి మోము గుంటలుపడే బుగ్గలు, కొంచెం పైకి తిరిగిన పై పెదవి, కొంచెం అంటే కొంచమే ఎత్తయిన క్రింది పెదవీ, సుడులుపడే సమ చుబుకమూ ఉండి, ఆ మోము కాసు బంగారంరంగు కలిగి, ఆ రంగుకు తగినట్లు లేత గులాబి రాగం అప్పుడప్పుడా బుగ్గలకు ప్రసరిస్తూ ఉంటే, అలాంటి సౌందర్య నిధులన్నీ చేకూరినచోట, ఆ నిధులకు కిరీటంలాంటి కళ్ళ అందం వెలసిందనుకొంటే, ఆ దివ్య సౌందర్యవదనం అనంతలక్ష్మిది. కాంచనమాలను, సుబ్బలక్ష్మిని, నళినీజయవంతను ముగ్గురినీ కరిగించి పోతబోస్తే అనంతలక్ష్మి అవుతుంది.

అవును. అనేకమందికి చక్కని హృదయాలనన్నీ గబగబ పువ్వుపుణికినట్లు పుణికే శక్తిగల సౌందర్యపూర్ణమైన మోము ఉంటుంది. అంతే. ఆ మోముకు తగిన తలగానీ, తలకట్టుగానీ ఉండవు. అతి పెద్ద లంకగుమ్మడి లాంటి తలో, పొన్నకాయలా మెదడులేని తలో ఉంటాయి. అనంతలక్ష్మికి తలకట్టు, తోడిరాగాలాపన ఆమె కేశ సౌభాగ్యము. కేశరంజనివారి ప్రకటన చిత్రాల తలకట్టులకు పాఠాలు నేర్పుతుంది.

ఎవరైనా ఒకశిల్పి “నీకు ఆ తలమాత్రం చాలదా” అని తెలివిగా అంటే పెదవి విరిచి ఊరుకుంటాడు.

పూర్వకవి అందాల మెడను శంఖంతో పోల్చాడంటే ఊరికే పోల్చాడా? ఇంగ్లీషుకవి వర్ణించే హంసమేడ ఆంధ్రకవిని హడలు కొడ్తుంది.

శంఖంవంటి కంఠం అంటే పైన లావు క్రింద సన్నమనిగాని, క్రిందలావు పైన సన్నమనిగాని కాదని కోనంగి అనంతలక్ష్మి కంఠంవైపు చూపులు పరుస్తూ అనుకున్నాడు. మూడు రేకలతో కూడిన్నీ శంఖం కాబోయే రూపము కలిగిన్నీ, శంఖంలా స్వచ్చమైన రంగు కలిగిన కంఠం సౌందర్యాతి సౌందర్యవంతమైనదని కవుల భావం అనుకున్నాడు కోనంగి. అలాంటి భావానికి పరిమళం ఇస్తుందికదా అనంతలక్ష్మి కంఠం.

అనంతలక్ష్మి కోనంగికి దాది అయింది. జయలక్ష్మి అనంతలక్ష్మిని “కాలేజీకి వెళ్ళు తల్లీ. నేను యీయన్ను చూస్తూ ఉంటానని బ్రతిమాలినా వినందే! మొదట కోనంగిని జ్వరంతో తీసుకుని వచ్చినప్పుడు కాలేజీకి వెళ్ళింది. కాని అక్కడ ఆమెకు ఏమీ తోచలేదు. ఏడుపు వచ్చినంత పని అయింది. మొదటిగంట కొట్టగానే ఒక ఉత్తరం తనకు జ్వరంగా ఉన్నదని వ్రాసి అనంతలక్ష్మి ప్రిన్సిపాలుగారికి ఇచ్చి, ఈవలకు వచ్చి, ఒక రిక్షా చేసుకొని ఇంటికి వచ్చివేసింది. మళ్ళీ కోనంగికి జ్వరం తగ్గేవరకూ కాలేజీ గడప తొక్కలేదు.

“తల్లీ, నీకు కూడా జబ్బుచేస్తుందేమోనే!” అని తల్లి అంటే ఆమె వినలేదు. తిరుపతి వెంకటేశ్వరులకు మొక్కుకుంది. మన్నారుగుడి శ్రీకృష్ణునికి మొక్కుకుంది. శ్రీరంగం శ్రీరంగశాయికి మొక్కుకొంది అనంతలక్ష్మి.