పుట:Konangi by Adavi Bapiraju.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూర్చపోయినంత పని అయిన అనంతలక్ష్మికి నరాలు బలం పొందాయి. ఆమె కన్నీరుమున్నీరై పోయినది.

ఈ పదినిమిషాలూ అందరూ మాన్పడి ఉన్నారు. అప్పుడు చౌధురాణీ ధైర్యంచేసి “డాక్టరుగారూ! ఏమయింది కోనంగిరావుగారికి?” అని ప్రశ్నించింది.

డాక్టరు సంతోషం వెలిబుచ్చుతూ “ఏమవడమేమిటి? మన కోనంగిని లోకం ఎంతో మెచ్చుకుంటూ ఉండగా వెళ్ళి సత్యాగ్రహం చేశాడు. పోలీసువారు అరెస్టుచేసి తీసుకుపోయారు. అదీ విషయం. ఎంతటి వీరుడు అతడు!” అని అన్నాడు.

జయలక్ష్మి కోపంతో “డాక్టర్! ఓహెూ ఏమి దేశభక్తి! యివతల భార్య గర్భవతికదా! ఇంట్లో భార్యను గురించి ఇంతయినా ఆలోచించకుండా, తనకోసం అని ఏర్పాటు చేసిన పత్రిక సంగతి ఆలోచించకుండా వెళ్ళుతాడా? ఔను, ప్రజలు మెచ్చుకోరు మరి! వాళ్ళదేమి పోయింది? తాము కాకపోతే ఇతరులను ప్రజలు ఎప్పుడూ మెచ్చుకొనడానికి సిద్దమే” అని పొలికేకలు పెడ్తూ జాడించింది.

అనంతలక్ష్మి చివ్వునలేచి “అమ్మా, వారినేమీ అనకు. నాదే అంతా లోటు. పదిమంది ఎదుటా చెప్పుకుంటే చేసిన పాపం కొద్దిగా అన్నాపోతుంది. వారిని అనుమానించాను. నానామాటలు ఆడి అవమానించాను. వారు ఉత్తమ పురుషులు. వారి హృదయం చిందర వందర చేశాను. ఆనాటి వారి నవ్వులో ఎంతదుఃఖమో గర్బితమై ఉండాలి. నా జీవితంలోంచి వెళ్ళి నాకు శాంతిని ఇవ్వాలని సత్యాగ్రహం చేసి ఖైదుకు వెడుతున్నారు!” అని సోఫామీద వాలి మోము వంచేసుకుంది. ఆమె కన్నుల నుండి జడివానలు కురిశాయి.

జయలక్ష్మి తెల్లబోయి ఒక్కనిమిషం కూతుర్ని చూచి “ఔనమ్మా! భార్యభర్తను వెనక వేసుకురాకపోతే ఇంకెవ్వరు వేసుకువస్తారు. ఈ రెండు మూడు రోజుల నుంచీ నువ్వు పడేబాధ అంతా చూస్తూనే ఉన్నాను. నేను పోరుపెడితే నువ్వు విన్నావూ?” అని అన్నది.

అనంత: ఏమి పోరుపెట్టావు? నేను ఏమి వినలేదు? .

జయ: ఎందుకులే!

అనంత: ఎందుకులే ఏమిటి? నీ ఉద్దేశం నాకర్థమయింది. నాకు వారు భగవంతులు. నా సర్వస్వము వారి పాదాల దగ్గర. నీ మనస్సులో ఏ సంకోచం ఉన్నా, నన్ను వారి అడుగునీడజాడల వెళ్ళిపోనీ. ఆయనతోపాటు నేను పాటుబడి ఇంత కలో గంజో త్రాగి బ్రతుకుతాము.

జయలక్ష్మి ఆశ్చర్యమంది “అమ్మిణీ! ఇవేమి మాటలు. యిదంతా నాకా? నీకోసం ఈ జంజాటమంతా పెట్టుకొన్నాను. లేకపోతే నాకు ప్రాణమయినా పోయి ఉండును. సన్యాసిని అయిపోయి ఉందును. నేను మాట్లాడినా, పని చేసినా, బ్రతికి ఉన్నా నీకోసమే” అని అన్నది. ఆమె కన్నులవెంట నీరు జలజలా ప్రవహించింది.

అనంతలక్ష్మి వెళ్ళి తల్లి ఒడిలో వాలిపోయింది. అక్కడ ఉన్న అందరి కళ్ళలో నీళ్ళు తిరిగినవి.

ఆ మరునాడు కోనంగిరావు కేసు విచారణకు వచ్చింది.

కోనంగిరావు తనకు వకీలు అక్కరలేదన్నాడు. పోలీసువారూ, యింకా కొందరు పెద్దలూ సాక్ష్యం ఇచ్చారు ప్రభుత్వం తరపున. కోనంగి అన్నీ ఒప్పుకున్నాడు. తాను చెప్పేది యేమీ లేదన్నాడు. అతనికి మేజస్టేటు ఎనిమిది నెలలు శిక్ష విధించాడు. “ఏ” తరగతి అనుగ్రహించాడు.