సంయోగానికి
సాధనమైనావూ
మహాత్మాగాంధీ....
అథోగతిలో పడి అల్లల్లాడే
హరిజనులందరి రక్షించావూ
వారికి హక్కు ప్రథమస్థానము
వారికి తిరిగి ఇప్పించావూ
మహాత్మాగాంధీ!
ఆ పాట పాడుకుంటూ కాంగ్రెసుజండా గాలిలో ఎగురుతూ ఉండగా, ఈక్విట్ ఇండియా, కాంగ్రెస్ జిందాబాద్! మహాత్మాగాంధీజీకి జై!” అని నినాదంచేసి,
“జయ! జయ గాంధీ!
జయ జయ లోకగురూ!
సత్యము ధర్మము చంపిన లోకము
నిత్య పదార్థము ఎరుగని లోకము
అమృతనినాదము నీ జయనాదము
ఆలకించుతూ ఆనందమాయే!
జయ జయ!”
అని మరల పాడినాడు.
అనేకులు ప్రజలు దూరంగా అతని అనుసరించసాగారు. ఇంతలో ఒక పోలీసులారీ వచ్చి, కోనంగి కడ అగింది. పోలీసువారాలు బండిలో నుండి దిగి కోనంగిని అరెస్టుచేసి బండిలో ఎక్కించి తీసుకుపోయారు.
కోనంగి ఎవ్వరితోనూ చెప్పలేదు. అతడు భోజనానికి రాలేదు.
ఉదయమే తిరువలిక్కేళిగోషా వైద్యాలయానికి వెళ్ళిన అనంతలక్ష్మీ, జయలక్ష్మీ, వారి పనిమనిషీ భోజనంవేళకు కారుమీద ఇంటికివచ్చారు. వారి మోములు సంతోషంతో కలకలలాడిపోతున్నాయి. అనంతలక్ష్మి మోము లజ్జారుణ కాంతివంతమై ఆనందపూర్ణమై ఉన్నది.
“నీ మొగుడితో నేనే చెప్పాను అమ్మిణీ!” అన్నది.
అనంతలక్ష్మి ఎప్పుడు భర్త ఆశుభవార్త తెలిసీ తన కడకు పరుగిడి వచ్చి తన్ను కౌగలించుకుంటాడా అని ఉవ్విళ్ళూరుతూ, తాను హాలులో కూర్చొని ఉంది.
వీరిని దింపగానే జయలక్ష్మి తన కారును మధుసూదనుని ఇంటికి పంపింది. ఆ కారు డ్రైవరు వారినందరినీ ఒక శుభ వర్తమానం వినడానికి త్వరగా రమ్మనమని వార్త తీసుకొని వెళ్ళినాడు.
వారందరూ భోజనాలు ముగించి రోజూ వారి కోసం వచ్చే కోనంగి కారుకోసం ప్రతీక్షిస్తున్నారు. కారు రావలసినకాలం అరగంట దాటిపోయింది. కోనంగిగారి కారు బదులు అనంతలక్ష్మి కారు వచ్చింది.
ఏమిటా శుభ వర్తమానమని అందరూ వెంటనే వచ్చారు. కారు మ్రోత వినగానే జయలక్ష్మి వరండాలోకి వచ్చివారి నేదుర్కొని “రండి, మీ అందరికీ పళ్ళు పంచి పెడుతున్నాను” అన్నది.