అనంతం: నేను ఒకరి వ్రాత పుస్తకంలో వ్రాసుకొన్న ఓ పాట ఆ మధ్య చదివాను, అది పాడుతాను!
పార్వతి: ఆనందం! కానీ!
అనంత:
ఆడవో శిభిరాజ ఆడు పింఛమువీడ
ఆలము నీలపు కాంతి అడవి కుసుమాలతో
ఆకాశవీధిలో అరుదెంచే మేఘాలు,
మేఘాల నృత్యంచే మెరుపు బాలిక ఒకతె!
నీలి బాలునివేణు ఆలపించెను నీలమేఘ మల్లారి నా మేనెల్ల పులకించే!
ఈ పాట ఆపుతూనే బాలికలందరు పరుగున ఆ మందిరం విడచి, తలుపులు పైన బిగించారు.
* * * *
కోనంగి తల్పములో తెల్లవారుతున్నది. భార్యను కౌగిలిలో అదుముకొనే
“ఏ మహాతపస్సును చేసినానో
ఏ పవిత్ర సుకృతాన్ని చేసినానో
నువ్వు నా దేవివై వెలసితివి బాలా?” అని పాడినాడు.
అనంతలక్ష్మి అతని కౌగిలి నుండి జారి అతని పాదాలపై తల నుంచి అవి ముద్దు పెట్టుకొంది. కోనంగి తానూ క్రిందకు వ్రాలి అనంతలక్ష్మిని సువ్వున ఎత్తుకొని హృదయాని కదుముకొన్నాడు. అయిదుగంటలు కొడుతున్నది.
ఇంతలో ఎవరో వారి శోభనగృహపు తలుపులు కొట్టినారు.
యిద్దరూ కౌగిలి వదలి ఒకరి నొకరు ఆశ్చర్యంగా చూచుకొన్నారు.
“అమ్మిణీ!”
భయపడిన, సగం ఏడుపు కలసిన జయలక్ష్మి మాట వినబడింది.
ఇద్దరూ తెల్లబోయి తలుపు వైపు చూచారు.
“అమ్మిణీ!” ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుపుతో జయలక్ష్మి పిలిచింది.
కోనంగి రెండంగలలో వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదుట జయలక్ష్మి, అనంతలక్ష్మి స్నేహితురాండ్రు, చుట్టాలు కళ్ళనీళ్ళతో ఏడుస్తూ కనబడ్డారు. వాళ్ళ వెనకాల పోలీసు అసిస్టెంటు కమీషనరు, ఇద్దరు ఇనస్పెక్టర్లు, కొంత మంది కానిస్టేబిలు కనబడ్డారు.
కోనంగిరావు తెల్లబోయాడు. “ఏమిటండీ ఇది?” అని జయలక్ష్మిని అడిగాడు.
అప్పుడు అసిస్టెంటు కమీషనరు “అయ్యా! మిమ్ము అరెస్టు చేస్తున్నాను. సాయంకాలమే చేయవసింది. కాని ఇది మీ శోభనపు దినం. అందుచే మీకెవ్వరికీ తెలియకుండా మీ మేడచుట్టూ కాపలా ఉంచి, తెల్లవారుతోందిగదా అని ఇప్పుడు అరెస్టు చేయడానికి వచ్చాను.”
జయలక్ష్మి నిలువునా కూలిపోయింది. అనంతలక్ష్మి చైతన్యంలేని కట్టబొమ్మలా నిలుచుంది.