పుట:Konangi by Adavi Bapiraju.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాణా: ఏమిటి వివాహమా? అయితే నువ్వూ శిక్షార్హురాలివే!

ఉష: వేయండి, నా భర్తతోపాటు నాకు కూడా శిక్ష. నన్ను అబల అన్నారు. పసిబిడ్డనన్నారు. స్త్రీలు అబలలా చక్రవర్తి? ఎవరు చేశారు మమ్మల్ని అబలలుగా? మా మామగారి సవతితల్లి సత్యవతీదేవి నరకమహారాజును ఓడించినప్పుడు స్త్రీలు అబలలుగా కనపడ్డారా తమకు?

బాణా: ఏమిటీ నువ్వు అంతకన్న అంతకన్న ఔచిత్యం మీరి మాట్లాడుతున్నావు. నీ ఎదుటనే నీ దొంగ భర్తను బట్టలొలిపించి ఒళ్ళంతా హూనమయ్యేటట్లు కొరడాతో- (అంటూ అనిరుద్దుని కడకుపోయి అతని రెండు చేతులు పట్టుకుంటాడు. ఉష తూలి క్రిందకు వాలిపోతోంది.)

ప్రవేశం ప్రత్యక్షమయినట్లు ప్రద్యుమ్నుడు.

ప్రద్యు: (పకపక నవ్వుతూ) వేయి బాహువుల బలంగల మా బావగారు బాలకుల మీదకు పోతున్నారు, ఇదట ఇదీ మీ ప్రతాపం? సమఈడుగల వియ్యంకులమీద చూపుదురు కాని.

బాణా: (సంశయంతో ప్రద్యుమ్నుని ఒకసారి, అనిరుద్ధుని ఒకసారి చూసి అనిరుద్ధుని చేతులు వదలి) ఎవరయ్యా నువ్వు? ఈ అబ్బాయి పెద్దన్నగారిలా ఉన్నావూ?

ప్రద్యుమ్నుడు: (పకపక నవ్వుతూ) కోడలు వాలిపోయింది. మామగారియందు భర్తతో మా అనిరుద్ద కుమారుడు యుద్ధం చేయడు. చటుక్కున పట్టుపడ్డాడు. భర్త అనిన్నీ, తన తండ్రి సహస్ర బాహుబలం కలవాడనీ అనుకుని భయపడి కుంగిపోయింది. కోడలిని సేదతీర్చవా ప్రాణేశ్వరీ!

ప్రవేశం మాయాదేవి ప్రత్యక్షమయినట్టు.

మాయా: (రతి) ఉషా రాకుమారీ! లే! ఈలా వచ్చి నా హృదయాన వాలు (ఉషను పొదివి పట్టుకుంది.)

బాణా: ఇదేమిటయ్యా. నా అంతఃపురాలలోకి భార్యతో వచ్చావు. ఎవరు నువ్వు?

ప్రద్యు: మేము ప్రద్యుమ్న నామధేయులము. మా జనకులు శ్రీకృష్ణ...

బాణా: అలా చెప్పు. ఆ నలువూ. ఆ నెమలిపింఛాలూ చూస్తూ కూడా ఆనవాలు పట్టలేక పోయాను. నాతో యుద్ధం చేయడానికి ఆ చేతిలో ఆ లీలాకమలం ఏమిటీ?

ప్రద్యు: ఈ పువ్వు యొక్క శక్తి ఎరుగరు మీరు బావగారూ! (ఆ పుష్పంతో బాణుని రొమ్ముపై లీలగా కొట్టగా విద్యుచ్ఛక్తి తాకిడి అయినట్లయి తూలిపోతాడు. తెర ఎత్తగా 20 మందిగాని, 30 మందిగాని బాలికలు నాట్యంచేస్తూ వగలు చూపిస్తారు. ఇక్కడ వెలుగు దర్శకత్వం బాగా చూపించాలి. సంగీతం అతిమనోహరం. బాలికలందరు బాణుని చుట్టి కౌగిలింతలు. ముద్దులు మొదలయిన చర్యలు నాట్యంలో చూపిస్తారు, చేస్తారు.)

13

ఈ రకంగా నాటకం అంతా పూర్తి అయింది. ప్రద్యుమ్నుని పాత్రపోషణ, మాయాదేవి పాత్రపోషణా, కథాసంవిధానంలో వీరిరువురకూగల గాఢసంబంధమూ చాలా రంగాలలో విన్యసింపబడింది. నాటకానికి అసలు దర్శకుడు కోనంగే అయ్యాడు. అసలు కథా, దాని సంవిధానం అంతా మార్పించాడు.

నాటక ప్రారంభంలో, ఇద్దరు వేదపండితులు వచ్చి వేదసూక్తము ఉషాదేవిని ప్రార్థిస్తూ గానం చేస్తారు.