పుట:Konangi by Adavi Bapiraju.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిదంబరంగారు మొగం చిట్లించుకుంటూ “ఏమిటండీ ఆ నవ్వు? రిహార్సల్సులో ఈలా ప్రతిబంధకాలు పెడితే నాటకం ఏలా తయారవుతుందండీ కోనంగిరావుగారూ?” అని అన్నాడు.

“అవదండి నాకు తెలుసును. కాబట్టి కానీయ్యండి. ఏమిలేదు ఆ పాట ఎందుకూ? ఏడుస్తూ ఎవరన్నా పాట పాడతారా? అని నవ్వు వచ్చింది” అని కోనంగిరావు అన్నాడు.

ఒక నటకుడు “మీకిష్టం లేకపోతే నాటకం మానివెయ్యండి” అన్నాడు.

“కోనంగిరావుగారు మానివేస్తే నేనూ మానివేస్తాను” అని ఉష వేషంవేసే అమ్మాయి లేచి నిలుచుంది.

“మన్మథుడు లేకపోతే రతి ఎందుకు?” అని రతీదేవి వేషంవేసే అమ్మాయి లేచింది.

కార్యదర్శి గోలపెడుతూ “అదేమిటండీ, నన్ను కూయంనదిలో పడమన్నారా, ఈ నాటకం అవుతుందని పేపర్లన్నిటిలో వేశాం. ఆహ్వానాలు పంపాము. కరపత్రాలు అచ్చువేసి పంపుతున్నాము. టిక్కట్లప్పుడే వేయిరూపాయల వరకూ అమ్ముడయ్యాయి. అందులో కోనంగిరావుగారి పేరు చూచే మూడు నాలుగు వందల రూపాయలు వచ్చాయట. నాటకం మానివేసి ఆంధ్రమహాసభను నడిసముద్రములో ముంచుతారా?” అని అన్నాడు.

కోనంగి నవ్వుతూ “చిదంబరంరావుగారూ! మీరేమీ భయపడకండి. నేను మానటంలేదు. ఎవ్వరూ మానరు. ఉషా అ బొద్దు పాఠ్యం నిరుద్ధులు కలిసినప్పుడు విడివిడిగా పాటలు పెట్టారు. రతీమన్మథులు కలిసినప్పుడు పెట్టారు. అవి చాలు. ఈ రంగం తర్వాత ఒక కొత్త రంగం ఉష తన గదిలో ఒంటిగా ఉండి, తన చరిత్రకు సంబంధించినట్లు ఒక పాట పాడితే బాగుంటుంది. అది మన కవిగారే రాసినారు. అది నేను కోరితే ఇచ్చారు. ఆ రంగం కూడ రాసినారు” అని చదివి ఆ పాట పాడి అందరకూ వినిపించాడు. అది చదువుతోంటే, పాట పాడుతూంటే విని అక్కడివారు ఆ నాట్యాభినయానికి ఆనంద నిమగ్నులైపోయినారు.

11

నీలాలు విరిగినవి, నింగిలో బూడిదలు

నీటి కలువలు తూలి నిలువునా కూలాయి

1

మసక మసకేసింది మధుమాస శశిమూర్తి

2

కుసుమ మధువులు అలమె విసపు మంటలు శక

3

తెగిపోయెనా వీణ తీగెలన్నీ నేడు

పొగలెగసె ధూపాల సెగలెత్తే హృదయాన

చిత్రఫలకమునందు చేరలేదే కుంచే

పత్రరచనకు రావు వర్ణనిన్యాసాలు

(ఆమె కంటిలో అశ్రువులు చేరాయి)