పుట:Konangi by Adavi Bapiraju.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1935 ప్రభుత్వం వారి భారతపరిపాలనా శాసనం కొత్తది వచ్చింది. కాంగ్రెసువారు ఎన్నికలలో పాల్గొని అఖండ విజయం పొందారు. కాంగ్రెసు మంత్రివర్గాలు వచ్చి చక్కగా పనిచేస్తుండగా యుద్ధంరావడం, కాంగ్రెసువారు ప్రభుత్వంతో అసహకారం చేయడం జరిగాయి.

ఇంతవరకు కోనంగి దేశంలోని జాతీయశక్తుల విజృంభణ ఒక్కసారిగా మనస్సున జ్ఞప్తికి తెచ్చుకున్నాడు.

రాజకీయంగా మూత్తమస్థితికి రావడానికి గాంధీమార్గమే ఉత్తమోత్తమమని ఒకవైపు వాదన. వేరొకవైపు లోకంలో ఇది ఎక్కడా లేదని సామ్యవాద వాదన. ప్రపంచం అంతా హింసాపూరితమై వుంటే నీ అహింస ఏమి చేస్తుందయ్యా అని డాక్టరు గారంటారు.

అహింస భగవద్దర్మమని అతడు ఏలా ఒప్పుకొంటాడు? డాక్టరు వాదనలో మహాత్ముడు దేశాన్ని మేలుకొలుపుతూ నూతన చైతన్యం ఇవ్వడం మొదలయిన మహెూత్తమ కార్యాలు చేశాడట. అందుకు సందేహం లేదట. కాని ఇకముందు కాంగ్రెసు కమ్యూనిస్టు పంథా అనుసరించాలట.

కమ్యూనిస్టులలో నాయకుడు పి.సి. జోషి అతడూ, బ్రాడ్లీ, ఫ్ర్పెట్ మొదలయినవారు అంతా కలిసి పెద్ద కుట్రచేశారు. దాన్ని ప్రభుత్వం వారు పట్టుకుని పెద్ద కేసుపెట్టారు. దాన్నే మీరటు కుట్రకేసు అని పిలుస్తారు. అందులో జోషి నాలుగేళ్ళు ఖయిదు అనుభవించాడు.

కాంగ్రెసు చప్పబడినట్లు తోచినప్పుడు బెంగాలులో విప్లవవాదం ఎక్కువైంది. పంజాబులోనూ అది ఎక్కువగా వ్యాపించింది. అప్పుడే భగతోసింగ్, రాజగురు, శుకదేవు మొదలయిన యువకులు పెద్ద కుట్రసలిపి హిందూ స్వతంత్ర ప్రభుత్వసేన అని పేరు : పెట్టుకొని ఉత్తరాలు పంపడం, ప్రకటనలు గోడలకు అంటించడం మొదలయిన పనులు సాగించారు. వైస్రాయిగారి రయిలుపైనే డయినమైటు ఉపయోగించి పేల్చివేద్దామను కున్నారు. అందరూ పట్టుబడ్డారు.

అప్పుడే రాజకీయఖయిదీలకు సరియైన గౌరవము కారాగారాలలో జరగటంలేదని కలకత్తాలో జితీనుదాసు డెబ్బదిఏడురోజులు నిరశనవ్రతం చేసి ప్రాణాలు బలిచేశాడు. భగత్ సింగు, శుకదేవు, రాజగురులను ఉరితీశారు. దత్తాను దయదలచి వదలివేశారు.

ఈలా యువకులలో స్వాతంత్ర్య వాంఛలు ప్రబలమై అనేక రీతుల ప్రవహించాయి. సాంఘికవాదులు వేరే ఒక సంస్థగా ఏర్పడ్డారు. వారికి నరేంద్రదేవు, జయప్రకాశ్ నారాయణ, మాసాని, మెహరల్లీ మొదలయిన వారు నాయకులుగా ఉండిరి.

ఆ రోజులలోను డాక్టరు రెడ్డికూడా సామ్యవాది అయి కాంగ్రెసులోనే వుండి పనిచేస్తూ ఉండినాడు. అనేకమంది యువకులవలె కాక, రెడ్డి చాలా జాగ్రత్తగా లోకానికి తన చరిత్ర ఏ మాత్రమూ తెలియనీయకుండా పనిచేస్తూ రహస్యము చక్కగా దాచుకొని ఉండేవాడు.

డాక్టరు ఉచితంగా కూలినాలి జనులకూ, రికావారికి, బళ్ళులాగే వారికి, మిల్లుకూలీలకూ, సామానులు మోసేవారికి వైద్యం చేస్తూ ఉండెను. వైద్యానికి వచ్చినప్పుడే వారితో రాజకీయాలు మాట్లాడుతూ ఉండేవాడు. ఎన్నో కూలి సంఘాలు ఏర్పరచాడు. జట్కావారి సంఘం, రిక్షావారి సంఘం, బళ్ళవారి సంఘం ఏర్పాటు చేయించాడు.