పుట:Konangi by Adavi Bapiraju.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసువారు మంత్రివర్గాలు మానివేశారు. కేంద్ర శాసనసభలోంచి వచ్చివేశారు.

మళ్ళీ దేశంలో ఉద్యమం ఏదైనా గాంధీమహాత్ముడు నడుపుతాడా అని అలజడి పుట్టింది.

1905-వ సంవత్సరం ప్రాంతాలలో బెంగాలు విభజన రోజులలో, దేశం అంతటా పాకిపోయిన విప్లవ ఉద్యమం ఫలితంగా ఎంత మందో రహస్య సంఘాలుగా చేరి దారులు దోచి, బ్యాంకులు దోచి ధనం సంపాదించడం, తెల్లవారిని హతంచేయడం, ఒక్కసారిగా దేశాన్ని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించడానికై కుట్రలు సలపడం ప్రారంభించారు.

విదేశాలలో అచ్చువేయబడిన రాజద్రోహపు కరపత్రాలు, పుస్తకాలు, అనేక మార్గాల దేశం అంతా వచ్చి పడుతూ ఉండేవి. అవి చదువుకొని యువకులు మండిపోతూ ఉండేవారు.

ప్రభుత్వం వారికి ఎన్నో రహస్యాలు తెలిసి కుట్రలు పెట్టి ఎంత మందినో అండమానుకు పంపారు. తిలకును మాండలేలో నిర్బంధించారు.

అలాగే నేడు సామ్యవాదులు చేయదలచుకొన్నారని ప్రభుత్వం అనుమానడింది.

5

శ్రీ మహాత్మాగాంధీ సత్యాగ్రహం ప్రారంభించడం ఏమిటి? చౌరీ చౌరాలో అల్ల రులు జరిగి, ఒక పోలీసుస్టేషను అందించివేశారు. దానితో గాంధీజీ సత్యాగ్రహెూద్యమం మానివేశారు. వారిపై ప్రభుత్వం వారు కేసు పెట్టితే ఆరుఏళ్ళు కారాగారవాసం శిక్ష విధించారు.

దాసుగారు స్వరాజ్యపక్షం స్థాపించారు. కాంగ్రెసు రెండు చీలికలైంది. ఖైదులో గాంధీగారికి కడుపులో అపెండిక్సుకు శస్త్రచికిత్స జరిగింది. వారు బ్రతికారు. వారికి విడుదల అయింది. అంతకు ముందే గయా కాంగ్రెసు, తరువాత బెల్గాం కాంగ్రెసు అయ్యాయి.

అహింసావాదం నెమ్మదిగా బలం సమకూర్చుకుంటూ వుండగా 1930 మార్చిలో గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రారంభించి దండయాత్ర గావించారు. అప్పటికి కోనంగికి పదమూడేళ్ళు.

దేశం అంతా ఉత్సాహం నిండింది. కోనంగి వెళ్ళి బందరు దగ్గర హంసలదీవిలో ఉప్పుసత్యాగ్రహం చేశాడు. దేశం అంతా సముద్రం దగ్గర ఉప్పుసత్యాగ్రహమే!

అక్కడ నుంచి పోలీసు అక్రమచర్యలు ప్రారంభం అయ్యాయి. లక్షలకొలది జైళ్ళకు పోయారు. లాఠీ ప్రయోగాలు, కాల్పులూను. కాని భారతీయులు చిరునవ్వుతో దెబ్బలు తింటూ, ప్రాణాలు అర్పిస్తూ, జైళ్ళకు వెడుతూ మహెూత్తమ అహింసాశక్తిని ప్రదర్శించారు. గాంధీమహాత్ముని కారాగారంలో ఉంచారు. చివరకు హరిజన ప్రశ్నపై బాపూజీ నిరశన వ్రతం చేయగా మహాత్మాగాంధీని వదిలారు. హరిజన సమస్య పరిష్కారం అయింది.

గాంధీ ఇర్విను ఒడంబడిక, గాంధీజీ రెండవ రౌండుటేబిలు సమావేశానికి ప్రయాణం జరిగాయి. రౌండుటేబిలు సభ నిష్ఫలం అయింది. గాంధీజీని హిందూదేశంలో అడుగుపెట్టగానే కారాగారవాసిని చేశారు. 1930 కన్న ఈ 1932 సంవత్సరంలో ప్రభుత్వం మరీ తీవ్రంగా కాంగ్రెసుపై దాడి సలిపింది. తిరిగి గాంధీజీ విడుదల అవడం, హరిజన సమస్యపై దేశసంచారం చేయడం జరిగింది.