కవిత్వతత్త్వ విచారము
ప్రథమ భాగము
మొదటి ప్రకరణము
కళాపూర్ణోదయమును రచించిన మహాకవి పింగళి సూరన్న, ఇతని జీవితముంగూర్చి శ్రీ కందుకూరి వీరేశలింగము గారి సుప్రసిద్ధ మైన కవులచరిత్రలో వ్రాయఁబడిన దానికన్న నా కెక్కువ దెలియదు. మఱి దెలిసికొనుటకు నుద్యమించిన వాఁడనుగాను. నా ప్రధానోద్దేశ్యము కృతి విమర్శనగాని చరిత్ర శోధనంబుగాదు. నాయీ కార్యమునకుం బ్రయోజకంబులైన యీతని జీవితాంశములు రెండు. శ్రీకృష్ణదేవరాయల కాలమునకుఁ దరువాతివాఁడనుటయు, ప్రాయశః రామరాజ భూషణ కవికిఁ బూర్వికుఁడనుటయు, మఱియు నింగ్లాండు దేశములోని కవులలో నగ్రగణ్యుండైన షేక్స్పియరునకు నితఁడు సమకాలీనుఁడై యునికియు సుసాధ్యమ.
ఆదికవుల గుణదోషములు
ఆకాలంబున నాంధ్రదేశమునఁ బ్రబలము గానుండిన కవితారీతి ప్రబంధరచన, ప్రబంధకవులకే మధ్య కవులనియుఁ బేరు గలదు. ఆదికవులయు వీరియు జాడలు వేఱు. అనేక విషయముల విరుద్దములును.
నన్నయాదులు సందర్భానుగుణములగు వర్ణనలందక్క నితర విధముల నూతన కల్పనలకుం దొడంగక సంస్కృతమున నుండు కథాదిక విషయములం దెనిగించుటలోఁ దమ శక్తిని ముఖ్యముగ వినియోగించిరి; అనగా, నీకవులు మొత్తముమీద భాషాంతరీ కర్తలే కాని యపూర్వ సృష్టిక్రియా నిపుణులుగారు. ఇట్లనుటచే వీరిపై దోషారోపణము జేయుచున్నానని నాపైఁ గినియకుఁడు! వీరికి ప్రతిభయు భావనాశక్తియు నమేయములు. అవి ప్రకాశమునకు వచ్చిన మార్గము లెవ్వియనగా: