పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

కవికోకిల గ్రంథావళి

మానవసంఘమున యథార్థమగు నాగరకత హెచ్చుకొలఁది ప్రజలయందు సౌందర్య పిపాసయు నభివృద్ధి నందు చుండును. అట్టికాలమున సామాన్యజనులుగూడ లలిత కళ నభిమానించుచుందురు. ఇది యెంతయు సహజము. కాళిదాసుని కాలమున హైందవ సంఘము చాల నాగరక స్థితి యందున్నదనుటకు ఆనాఁటి యాచార వ్యవహారములును, కళాకౌశలమును, సాక్ష్యములుగ నున్నవి. అందుకు కాళిదాస మహాకవియె మొదటి దార్కాణము ! కవుల కావ్యము లందు సమకాలీనమయిన సాంఘిక పరిస్థితులు, తదభ్యుదయ పరిణామములు ప్రతిబింబించుచుండును. సారస్వతము సంఘమయొక్క యుచ్చ నీచస్థితులను దెలియఁ జేయు 'భారమితి' యని చెప్పవచ్చును.

కాళిదాసుని కాలమునఁ జిత్ర లేఖనము, నృత్యము, సంగీతము, నాటకము మున్నగు లలితకళలు చాలవ్యాప్తిలో నుండినవి. మాళవికాగ్ని మిత్రమునం గల యంతర్ణాటిక యందు కాళిదాసు ఆకాలపు రాజకుటుంబముల నృత్యవినోదములను చూపించినాఁడు. శకుంతలను అత్తవారింటికిఁ బంపు సమయమున వనస్పతు లొసఁగిన యాభరణములచేతఁ దమ సకియ నలంకరింపఁబోవుచు ననసూయ ' మే మింతవఱకు భూషణముల నుపయోగించి యెఱుఁగము. అయినను జిత్తరువు వాఁత యలవాటునుబట్టి నీ యంగములయం దాభరణ వినియోగము చేసెదము' అని పలికెను. వనమున నివసించు ఋషి కుమారికలె చిత్ర లేఖనమునం దంత నిపుణులై యుండ, నిఁక నాగరక యువకులమాట వేఱ చెప్పవలయునా? ఆద