పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత్వ తత్త్వ నిరూపణము

31

భారతాది మహాగ్రంథములును, శాకుంతలాది నాటకములును నిదర్శనములు.

కవి వ్యక్తిత్వము ఆతని రచనలయందుఁ బరిస్ఫుటముగ నంకితమైయుండును. ఒ కేవిషయమును పలువురు కవులు, కావ్యములుగ రచియించి రేని వానియం దొకటొక్కటియుఁ బ్రత్యేకరూపగుణ విశిష్టముగ నుండును. ఒక్కొక్కరియందు కళానైపుణ్యమును, ప్రతిభయు, నభిరుచియు భిన్నభిన్నముగ నుండుటవలన వారి కృతులందు సైత మట్టి భేదములు గనుపట్టుచుండును. సర్వసామాన్య వస్తువైనను, అది కవి యంతః ప్రకృతితో సమ్మిళతమఁయి రూపాంతరమునొంది, కావ్య కుటుంబమునకుఁ జేరీనదయ్యుం బ్రత్యేకత వహించి యుండును. కవి తనకు మాత్ర మిష్టమైన వస్తువును భావమును మనోవస్థను సర్వజనీనముఁ జేయుటకుఁ బ్రయత్నించుట కన్న, సర్వజనీన వస్తుభావ మనోవస్థలను దన వ్యక్తిత్వముచే నంకితముఁ జేయుట మేలు. అనఁగా అన్ని ప్రకృతులకు సామాన్యమైన భావావస్థలకు రూపముఁగల్పించి యే ప్రకృతి నైన రంజి.పఁ జేయవచ్చునుగాని, యొక ప్రకృతికి మాత్రము సమ్మతమైన దానిని సర్వజనీన మొనరించుట యసాధ్యము.

మహాకవుల కావ్యములందుఁ బైన చర్చింపఁబడిన నాలుగంశములు ననివార్యముగ నుండును. ఇంకను విమర్శించుకొలఁది యెన్నియైన సూక్ష్మాంశములు తేలవచ్చును. కాని, గ్రంథ విస్తర భీతిచే వానినిఁ చర్చింప మానుకొంటిని.