పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలంకార తత్త్వము

149

ఒకడు చలినీటిని తాకె ననుకొనుడు. ఆ నీటి చల్లదనమును గుఱించి ఆతడిట్లు చెప్పును : చల్లగా నున్నవి. ఎక్కువ చల్లగా నుండెనేని ఎక్కువ - మిక్కిలి - చాలా - యెంతో అను విశేషణముల నుపయోగించును.

ఈ విశేషణములన్నియు సమానార్థకములె. తారతమ్యమంతగా స్ఫురింపదు. అయినను వాడనుభవించిన చల్లదనమును వర్ణించుటకు ఈ విశేషణములలో నొకటియు చాలదు. అంతట వాడు లోకానుభవజ్ఞానము వలన మిక్కిలి చల్లగానుండు వస్తువు మంచుగడ్డ యొకటి యున్నదని తెలిసికొని "ఈ నీళ్ళు మంచుగడ్డవలె చల్లగా నున్నవి” అని చెప్పును. అంతకంటెను చల్ల గా నుండు నెడల, మంచుగడ్డ కన్న చల్లని వస్తువు నాతడెఱుగని యెడల. ఇక “చల్లని" యను పదమును సాగదీసి యుచ్చరించుచు ఆ పదార్థమును తాడినప్పుడు కలుగు ముఖవికారము నభినయించుచు “అబ్బ! యీనీళ్ళు చల్ ల్ ల్ ల్ ల్ లగా ఉన్నవి” అని నొక్కి చెప్పును. ఇంతటి శీతలత్వమును ప్రకటింపగల పదము భాషలో రూఢియై యున్నయెడల అతడు సాదృశ్యసహాయము పొందవలసిన యవసరముండదు. కాని యే భాషయు ఎప్పటికిని. అట్టి పరిపూర్ణత పొందజాలదు.

“అరవిందాలు గదోయి కన్నులు” అని కవియొక రమణీయవతి కన్నులను వర్ణించును. కవులు భావోద్రిక్త మానసులు. వారి దృష్టి భావరంజితము; శబలితము. అందువలన సామాన్యులు చూడజాలని అంతర్లీనగుణసౌభాగ్యమును కవి దర్శించును. కవి ప్రకటింప దలచుకొన్న భావము