పుట:Kavikokila-Granthavali-4 Vyasamulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

కవికోకిల గ్రంథావళి


లయి పండిన పండ్లవలె కాలక్రమమున వృంతచ్యుతములగును. కాలారఁ దిరుగ నేర్చిన బిడ్డ రక్షకత్వగర్వము వహించిన ముసలి దాది పట్టియుంచినను పెనఁగులాడి పట్టు వదలించుకొనునటుల స్వతంత్రమైన కవిహృదయము సంకుచిత నియమ బద్దముగాక యెదురుతిరుగును. అసంతృప్తి కలిగినప్పుడు అజ్ఞాతముగనె కవిప్రతిభ అనుకూలమైన ప్రచల నావరణము నేర్పఱచుకొనును. ఈ కార్య మాతనియందు అప్రయత్నముగ నే జరిగిపోవుచుండుట వలన స్వాభావికముగ నుండును; కవి నిరంతరము నేక సంప్రదాయ బద్దుఁడే యైన యెడల రచనలయందు వివిధత్వముండదు. ఇట్లనుట చేత కవి నియమరహితుఁడని చెప్పుటగాదు. స్వయంకల్పిత నియమములు కలవు. నియమబద్దముగాని శిల్పమునందు ఔచిత్య ముండదు. అరాజకత్వముండును. స్వాతంత్ర్యముకూడ నియమబద్దమె.

జాతీయ జీవిత ప్రవాహమును ఆనకట్టలుకట్టి నూతన మార్గముల మరలింపఁగల నాయకులు, కవులు, చారిత్రక మహాపురుషులు ప్రతిదినమును పుట్టుచుండరు. అట్టివారిని సృజించుటకుఁ బ్రకృతికూడ కొంతకాలము వేచియుండి శ క్తిని సంపాదించుకొనవలయును. అట్టి ప్రతిభావంతులు పుట్టినపుడు ఆ కాలమునకు వారివాక్కు ప్రాతినిధ్యము వహించును.

ఆంధ్రదేశ రాజకీయ చరిత్రమునందు కృష్ణదేవరాయల రాజ్యకాలమొక సువర్ణ ఘట్టము, హరిహర రాయలచేఁ బ్రారంభింపఁబడిన విజయనగర సామ్రాజ్యము కృష్ణదేవరాయలనాఁటికి బరిపూర్ణతనొంది, భోగభాగ్యములఁ దులఁ.