పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృశతకము

315

ఇలనేదేశమునందు నిట్టికళ నెందేఁగాంచమంచున్ జనుల్
పలుకం, జంద్రశిలావళీరచితమై ప్రత్యగ్రరత్నాంకురో
జ్జ్వలమై తాజమహల్ నిలింపపురినా సంధించు నాశ్చర్యమున్
గలరే నేడును నట్టిశిల్పులు ధరాకాంతాగ్రణుల్ మాతరో.

దేవాగారవిహారమంటపములన్ దీపించు చిత్రాళి ప్రా
ణావిర్భావముగల్గఁ బల్కవె త్వదీయానల్పశిల్పక్రియా
సేవాసక్తి “నజంత” చిత్రరచనా శిల్పోన్నతిం గన్న నేఁ
డేవారల్ నిమసన్నుతింపరు ముదంబెచ్చన్ మదిన్ మాతరో.

యవనోర్వీశుల ధాటికిన్ మిగిలి యర్ధానర్థరూపంబులం
దవులన్ నిల్చిన దేవతాలయములన్ దర్శింపఁ ద్వత్పూర్వశి
ల్పవిధానంబుల యస్థిపంజరము లన్ భావంబుదోఁ తెంచు; నిం
క వివేకింపుమ పూర్వశిల్పమెటులం గాంతిల్లెనో మాతరో.

మును మంత్రంబులశక్తిచేఁ బ్రతిమలైపోయెన్ శిలల్, లేకయుం
డిన నింకెట్టుల నిట్టివిగ్రహములన్ నిర్మించు నేశిల్పియై
నను నాఁగన్ రమణీయ శిల్పముల ధన్యంబైన “యెల్లోర"సృ
ష్టినిగావించిన సిద్ధహస్తుల కళల్ జీర్ణించెనే మాతరో.

హరినీలంబులు పద్మరాగములు వజ్రాంకూరముల్ పచ్చలుం
బరగన్ నవ్యమహేంద్రచాప సుషమా ప్రాగల్భ్యముంగేరు ఠే
వ రహించెంగదె నెమ్మిగద్దియ కళావాల్లభ్యముంజాటు చా
వరపీఠం బిపు డేడనున్నదొ మదిన్ భావింపవే మాతరో.