పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/332

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృశతకము

311

వనధిన్ గోష్పదమట్లుదాటి యసుర శ్రాతంబుఁ జెండాడి సీ
తను దర్శించి యశోకవాటిక సముద్ఘాటించి పౌలస్త్యు చెం
తను నిర్భీతిగ రామునాజ్ఞపలుకన్ దర్పించి లంకం ద్రుటిం
గనదగ్నిన్ రగిలించు మారుతి కిఁకం గైమోడ్పనే మాతరో.

కురువంశస్థులు పాండవుల్ సమదనిర్ఘోషంబులం జేయుచున్
ధరణీచక్రము దిద్దిరందిరుగ యుద్ధక్రీడ నన్యోన్యమున్
శరకౌశల్యముఁ జూపఁ గాంచి మది నుత్సాహంబు పొంగంగ నీ
మురువుఁజూపిన కాలమిప్డు కలయైపోయెంగదే మాతరో.

మును చంద్రార్ధకళా కిరీటు శివునిం బోరన్ బడాయించి యా
తని మెప్పించి గడించి పాశుపతమున్, ధర్మక్షమాజానికిన్
ఘనరాజ్యంబును గట్టి కౌరవపతిం గాఱించి శౌర్యంబు చూ
పిన గాండీవి శరాలు త్రుప్పుదినెనే పృథ్వీస్థలిన్ మాతరో.

గురుకర్ణాఖిలయోధ సంఘటితమై ఘోరారి దుర్భేద్యమై ..
స్థిరమై యొప్పెడు తమ్మిమొగ్గరము దోఃస్థేమంబునం జీల్చి వై
రి రసాకాంతులు సైతముం బొగడ నిర్జిద్రోగ్ర సంగ్రామబం
ధురతం జూపిన పార్థపుత్రుఁడు మదిందోఁతెంచు నే మాతరో.

విజయా, నీతలగాచికొమ్మని రణావేశంబునం దేరులుం
గజముల్ సేనలు పీన్గుపెంట లటులం గావించి గర్జించి, యం
బుజనాభుండును జక్రమెత్తునటు లేపుంజూపె గాంగేయుఁడా
ధ్వజినీకాంతుని యంపశయ్యఁ గనుమా భావంబునన్ మాతరో.