పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

256

కవికోకిలగ్రంథావళి

పుట్టునొయొక్క బిడ్డ యటుపోవుట వచ్చుటఁ జూచుభాగ్యముల్
గట్టునొయంచు నాకడుపు గల్గినదాదిగ నెంచికొందు; నీ
యట్టిడు పుట్టి చందనకుజాళికి నల్లిన ముండ్లతీవెనాఁ
గట్టడి బిడ్డవైతివిగ కాఁపుకులానకు మచ్చ వెట్టఁగన్.
తనయుఁడు గల్గునా, కులముధన్యతనొందున, పేరునిల్పునా,
యని మదినెంచి యుంటి నవురా, యిదియేమిర, చేటుగాల మీ
వనయము వారకాంతల గృహంబునఁ బ్రొద్దులుపుచ్చి పెద్దవా
రిని రవసడ్డసేయక చరించెదు సోమరిపోతువై యసీ!
కులమును శీలముం గలుగు కోడలు నా కుపచర్యసేయరాఁ
బిలిచెడు భాగ్యమబ్బునని ప్రీతిమెయిం దలపోయుచుంటి; నేఁ
దెలియక పోతి నీ కసటుఁ దెక్కలి చెయ్వులు,మానవేర యా
కలికి పిసాళి పచ్చిపలగాకులఁ గూళల రోనెలంతలన్.
కంటిని నీరు చైదములు, కంటిని నీకయి డబ్బుపోకడల్ ;
తుంటరివారిఁజేరి వెలతొయ్యలి నెయ్యము దెచ్చికొంటె; వా
ల్గంటులు లేరె కాఁపుల కొలంబునఁ బెండిలి చేసికోఁగ; పా
ల్వంటి కులంబు నీటఁగలుపన్ గమకించితె యోరిమూర్ఖుఁడా.

[శ్రీ తిరుపతి వేంకట కవుల శ్రవణానందమును చదివిన వెనుక అటువంటి కథనే కల్పించి 'కావ్యము వ్రాయవలయునని దీనిని వ్రాసితిని. ఇది నాలుగాశ్వాసముల ప్రంబంధము. 550 పద్యములు.)