పుట:Kavijeevithamulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిక్కనసోమయాజి.

83

గీ. కథ జగత్ప్రసిద్ధి గావునఁ బూర్వప, ర్వార్థయుక్తిఁ జేయునట్టియెడల
   యత్న మించుకంత యైనను వలవదు, వలసినట్లు చెప్ప వచ్చియుండు.

   అని విన్న వించి సోమయాజిగ్రంథారంబు సేసె నని యున్నది.

పైపద్యము పరిశీలింపఁగఁ దిక్కనసోమయాజివలనఁ జేయంబడిన మఱియొకనియమము మనచరిత్రమునకు ముఖ్య మగునది బయలువెడలు చున్నది. అదియే లోకములో సోమయాజి భారతముఁ దెనిఁగించుచో సంస్కృతమాతృకను జూడకయే భారతగ్రంథము అశుధారను నిరంకుశప్రజ్ఞతోఁ జేసియున్నాఁ డని చెప్పెడుప్రతీతికిఁ గారణ మయు యుండును. ఆయంశ మెద్ది యనఁగా :- భారతకథ జగత్ప్రసిద్ధ మయినది. కావున పూర్వపర్వార్థములను సందర్భింపఁ జేయునప్పుడు యత్న మే మాత్ర మక్కఱ యుండ దనియును, ఇష్టానుసారముగ సందర్భము పొసఁగింపవచ్చు నని చెప్పినవాక్యమే. దీని కర్థము బుద్ధిమంతు లేమిచెప్పవచ్చునో యూహింపుఁడు. ఇది చదివినయప్పుడు పుక్కిటిపురాణములుగా వాడుకొనఁబడుచున్న తిక్కనసోమయాజికృత ప్రతిజ్ఞాదికమున కిది యాధారమై యుండు నని తోఁచకపోదు.

తిక్కనసోమయాజి వ్యాసుని నుతించుట.

సోమయాజి తనకు భారతకృతనిర్మాత యగువ్యాసమహర్షి పయింగలభక్తివిశ్వాసములను అవకాశమైనప్పుడెల్ల వివరింపుచుండును. ప్రతి యా శ్వాసమున నాద్యంతములలో హరిహరనాథుని నుతియించినట్లుగనే వ్యాసభగవానునిఁగూడ స్మరియించుచుండును. సోమయాజికి భారతరహస్యార్థములు స్ఫురియించుచో వ్యాసావేశంబు గల్గియుండె నని ప్రతీతి గలదు.

సోమయాజికిఁ గలశాస్త్రపాండిత్యము.

సోమయాజికి వేదాంతాదిశాస్త్రములందును, సాంఖ్య యోగాదిశాస్త్రములలోపలను గలవిశేషపాండిత్యము శాంత్యానుశాసనిక పర్వములను తక్కినపర్వములలోఁ దత్త్వముం జెప్పెడునితిహాసాదుల వలనం గోచరంబులు గాఁ గలవు. పూర్వోత్తరమీమాంసాశాస్త్రము