పుట:Kavijeevithamulu.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వెన్నెలకంటి వేంకటాచలము.

689

అని యిట్లున్న వేజెళ్లవారి వంశావళిలో నఱ్ఱా జనునామము గలవాఁ డతఁ డొక్కఁడేగాని యితరులు లేరు. ఈనఱ్ఱాజుకడ నీవెంగన్న మంత్రి యై యుండుటయేగాక యితనియన్న యగు నయ్యపరాజు మనుమఁ డగుకృష్ణభూపాలుఁడు బాలుఁ డై యుండ నతని దొరను చేసుకొని కార్యము నడిపిన వాఁడనియుఁ బై పద్యములో నున్నది. ఈపట్టున వంశావళీగ్రంథ మెట్లున్నదో చూచెదము. అందులో నీక్రిందివిధంబుగా నున్నది. దాని వివర మెట్లనిన :_

"పై అయ్యపరాజపుత్రులు పెదనర్సరాజు చిననర్సరాజు అనువారలు. వీరిలో చిన్ననర్సరాజు తనయన్నతో శఠించి తూర్పు విజయనగర సీమకు లేచిపోయెను. పెద్ద నర్సరాజు తండ్రి అనంతరము వ్యవహారములోఁ బ్రవేశించి చంద్రగిరి, తిరుపతి మొహరాలలోఁ (యుద్ధములలో) గష్టపడి, పూర్వము తమకు నడిచే అమరము, చీమకుర్తి గ్రామాదులును, జాగీరుగా నడిచే గుడ్లూరుతాలూకాయును, ఇదిగాక పాకల, జలదంకి మొదలగు కొన్ని సముతులును, జాగీరులుగాను, అంబారీ, డంకా, నౌబతు, గడియారము మొదలగు బిరుదు నిషానులును బహుమతిగొని, సర్కారు నౌకరీలో హాజరు బాషీ చేయుచుండె. ఇట్లుండ నీయనబావమఱఁది యగుమందపాటి మూర్తిరాజనునతఁడు పై అయ్యపరాజుకడ సర్దారుఁడై యుండి ప్రభుత్వ మాక్రమించుకొనవలయు నని దివాణములో పితూరీచేసి భీమవర మనుగ్రామములోఁ బెద్ద నర్సరాజు చిన్ననర్సరాజు చిన్నవారితోఁగూడఁ గోటలోనుండగా ఫౌంజును తెచ్చి కోటచుట్టుకొని పెద్దనర్సరాజును నష్ట పెట్టెను. ఈపెద్ద నర్సరాజు 36 సంవత్సరములు రాజ్యము చేసెను.

కృష్ణమరాజుచరిత్రము.

అనంతరము పెద్దనర్సరాజు కుమారుఁడగు కృష్ణమరా జనునతఁడుమూఁడుసంవత్సరములయీడుగల బాలుఁడై యుండుటంబట్టి అతనిమంత్రి వర్గము కందుకూరిలో లష్కరుతోఁగూడ నుండిన ఫౌంజుదారుని దర్శించిరి. అప్పుడు ఫౌంజుదారుఁడు కృష్ణమరాజు బాలుఁ డనుకారణముచేతను గుడ్లూరు పరగణామాత్ర మతనికిచ్చి దానికి (700) నేడువందలవరాలు పేష్కషు నిర్ణయించి తతిమ్మా పర్గాణాలు సర్కారులో దాఖలు చేసుకొనియె. అంతట కృష్ణమరాజు భీమవరము మకాము చాలించుకొని గుడ్లూరిలోఁ గోటకట్టించుకొని పైతాలూకా అనుభవించుచు (42 సం.) నలుబదిరెండేండ్లు ప్రభుత్వము చేసెను."

ఇ ట్లుండుటంబట్టి పైకథను వేంకటాచలకవి యీవంశావళీగ్రంథముల ననుసరించియే చెప్పెనని స్పష్టమే. కృష్ణమరాజు బాలుఁడుగా నుం