622
కవి జీవితములు.
మ. అమరేంద్రాశకుఁ బూర్ణచంద్రుఁ డుదితం బైనట్లు నారాయణాం
శమునం బుట్టె మదాంధరావణశిరస్సంఘాతసంచేదన
క్రమణోద్దాముఁడు రాముఁ డాగఱితకున్ గౌసల్యకున్ సన్ను తా
సమనైర్మల్య కతుల్య కించితజనుస్సంసారసాఫల్యకున్. భాగ. స్కం. 9.
శా. ఈవానం బరిపీడ నొందువసుల న్వీక్షించి రక్షార్థినై
వేవే యిద్ధరణీధ్రముం బెఱికితిన్ విస్తీర్ణ మీక్రింద మీ
రేవా రెచ్చట నుండఁ గోరితిరి మీరెల్లం బశుశ్రేణితో
భావంబు న్భయ ముజ్జగించి చనుఁడీ భవ్యాద్రిచా టందఱున్. హరి. పూ. భా. ఆ. 6.
శా. బాలుం డీతఁడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపఁగాఁ
జాలండో యని దీనిక్రింది నిలువ న్శంకింపఁగాఁ బోల దీ
శైలాంభోనిధిజంతుసంయుతథరాచక్రంబు పైఁబడ్డ నా
కే లల్లాడదు బంధులార నిలుఁ డీక్రిందన్ బ్రమోదంబునన్. భాగ. స్కం. 10. పూ
ఇంకను ననేకస్థలంబులు గలవు. వానిం బరికించిచూచినఁ బోతన కవిత్రయమువారితో సమానుఁ డని కంఠోక్తిగఁ జెప్పఁదగు. వారు చేసినపద్యములుచూచి యీతండు కొన్నిటివ్రాసెఁ గావుననంతకంటెను గొంచెము బాగుగ వ్రాసె నని యనవలదు. ఈతని జూచివ్రాసిన యీతనిశిష్యుల కవనంబును తర్వాత మఱికొందఱు వ్రాసిన కొన్నికొన్ని భక్తిరసపద్యంబులును వీనికి నీడుగ నున్న వే? కావున నిది పోతనకవిత్వ పటిమయే యని చెప్పఁదగు.
వీరభద్రవిజయవివేకము.
బమ్మెర పోతరాజు వీరభద్రవిజయ మనుగ్రంథము రచియించి యుండె నని యొకప్రతీతి గలదు. అయ్యది భాగవతశైలి నుండ లే దనియు నది పోతరాజు వార్థికదశలోఁ జేసియుండుటచేత నందులోఁ గొన్ని దోషంబులు కలిగె ననియు నాంధ్రకవి చరిత్రములో వివరింపంబడియె. లోకములోనివాడుకగూడ నట్లే యుండుటచేత నాగ్రంథము విమర్శనా పూర్వకముగాఁ గొంత చదివి యందలి పరస్పరభేదంబులఁబరికించి యది భాగవతగ్రంథకర్త యగు బమ్మెరపోతనకృతం బగునా యని యీక్రిందికారణములనుబట్టి సంశయించుట కలుగుచున్నది. చదువరు లద్దానిలోని విశేషముల నరయురురుగాక.