పుట:Kavijeevithamulu.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

498

కవి జీవితములు.

గ్రహారపు యజమానత్వము ఆయగ్రహారీకుల కే స్థిరపఱచఁబడెను. అందుమీఁద రాయదత్త యజమాన పెత్తన మని వ్యవహారము జరిగెను. కృష్ణదేవరాయలు కొండవీడుప్రభుత్వము చేయుకాలములో కొండపల్లి దుర్గము సంపాదించవలె నని యనేకసైన్యముతోఁ గొండపల్లికి దక్షిణముగా నున్న కొండగూటూరు (ఇపు డిభరాంపట్ణ మని వాడెదరు) అను గ్రామములో బ్రవేశించి అచ్చట శుకురాజు బాహుబలేంద్రుఁడు అను రాజులతోఁ బండ్రెండు సంవత్సరములవఱకుం బోరాడెను. గజపతుల నోడించి కొండపల్లి స్వాధీనపఱుచుకొనినట్లు కనుపించదు. అను మొదలగువృత్తాంతము లున్నవి. ఇందలి కథలలోఁ జివర నుండుశుక రాజు బాహుబలేంద్రులకథకు పద్య కావ్యములలో నాధారములు గాన్పించవు. కావున వీనికినిటనుండి పద్య కావ్యములోవివరించిన చారిత్రమును దానితో సంబంధించిన హాకీ ఖత్తులను వివరించెదను. ఇదివఱలోఁ జెప్పినవృత్తాంతము కొండవీడు దండకవిలెలోనిది. అది కేవలము విశ్వసనీయ మనుటకు వీలుపడదు. కావున మనుచరిత్రము పారిజాతాపహరణము, ఆముక్తమాల్యద వీనిలోఁ జెప్పంబడినప్రకారము కృష్ణరాయని విజయములం జెప్పి అతని రాజ్యకాలము అతనిరాజ్యవిస్తీర్ణతను నిర్ణ యించెదము గాక.

కృష్ణరాయల రాజ్యవిస్తీర్ణత కటకపుదేశముం జయించుట.

ఇఁకఁ గృష్ణరాయని కాలములో నీవిజయనగర రాజ్యమెంతవఱకు వ్యాపించియున్నదో దానిని తెలియవలయును దానికి పారిజాతాపహరణములోని పద్యము

"సీ. ఉదయాద్రి వేగ నత్యుద్ధతి సాధించె, వినుకొండ మాటమాత్రన హరించె
      కూటముల్ సెదరంగఁ గొండవీ డగలించె, బెల్లముకొండయచ్చెల్లఁ జెఱిచె
      వేలుపుకొండ నుద్వృత్తిభంగముజేసెఁ, జల్లిపల్లి సమగ్రశక్తిఁ గూల్చె
      కినుకమీఱ ననంతగిరి క్రిందుపడఁజేసెఁ, కంబము మెట్టు గ్రక్కనఁ గదల్చె"

అని యున్న పద్యముంబట్టి పారిజాతాపహరణ రచనకాలంబు నాఁటి కాకృష్ణరాయలు, 1 ఉదయగిరి, 2 వినుకొండ, 3 కొండవీడు, 4 బెల్లముకొండ, 5 వేలుపుకొండ, 6 జల్లిపల్లి, 7 అనంతగిరి, 8 కంబము