పుట:Kavijeevithamulu.pdf/486

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

480

కవి జీవితములు.

డ్రు అపహరించ యత్నము చేసిరి. గాని జనబాహుళ్యముచేత నొకరిమాట యొకరికిఁ గాక, సుమారు నలువది సంవత్సరంబులవఱకు ఒకరితో నొకరు కలహించుచుండిరి. ఇంతలో శా. శ. 1351 సంవత్సరములో నుత్కలదేశాధీశు లగుగజపతివారు ప్రబలులై విస్తరించి బలమును గూర్చుకొని కొండపల్లి మొదలగు దుర్గముల నాక్రమించి, కొండపల్లిలో మకాము జేసిరి. ఇట్లుండ తుంగభద్రాతీరస్థం బగువిజయనగరపురా జగుకృష్ణదేవరాయలు ఆంధ్రదేశమంతయు నాహుతి వేసికొనుటకు యత్నించెను."

కృష్ణదేవరాయలజన్మకథాప్రశంస.

"విజయనగరపురాజులలో [1] పదియాఱవవాఁ డగువీరనృసింహరాయలు చిరకాలము పుత్త్రులు లేక ఖేదపడుచుండఁగా నొకనాఁ డొక విప్రశ్రేష్ఠుఁ డేతెంచి రాజా ! నే నేర్పఱిచిన ముహూర్తకాల మందు నీవు నీభార్యతోఁ గూడినచోఁ దప్పకుండ నీకు పుత్త్రుఁడు కలుగును అని చెప్పెను. అందుల కారాజు సంతసించి ముహూర్త కాలమునకు సిద్ధముగా నుండునటుల నిజపత్ని యగు తిప్పాంబకు వర్తమానము పంపెను. "చీరె సింగారించువఱకు పట్నము కొల్లబోయెను." అను లోకమువాడుక నిక్కము గాఁ దిప్పాంబగారు దిద్దుకొని తీర్చుకొని రాజు సమ్ముఖమున కేతెంచువఱకు ముహూర్తకాలము మించిపోయెను. ఈమధ్యకాలములో రాజుగారి పడకటింటిలో దీపాలు బాగు చేసెడి నాగి యను నొకదాసి ముహూర్తకాలమునకు హాజరు గా నుండఁగ రాజు దానితో రమించెను. తత్క్షణమే నాగికి గర్భోత్పత్తి ఆయెను. నవమాసపూర్తి యైనతర్వాత దివ్యతేజస్సు కలిగినశిశువును గనెను. ఈశిశువునకు కృష్ణదేవరాయలు అనునామ మేర్పడెను."

కృష్ణదేవరాయలు రాజ్యభారము వహించినవిధము.

"పూర్వము వక్కాణించిన నాగి యనునది గర్భవతి యైన కొం

  1. విమర్శించవలెను.