పుట:Kavijeevithamulu.pdf/415

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పిండిప్రోలు లక్ష్మణకవి.

409

బయలు వెడలి, తనయుద్దేశ మితరులకుఁ దెలియకుండఁగ తనయిజారా గ్రామ మగుకుయ్యేరునకు వచ్చి లక్ష్మణకవియొక్క లంకమాన్యము తనభూమిలోనిదిగా నిర్ణయించి పోయెను.

ఇట్లు తనమాన్యము దమ్మన్నవలన నపహరింపఁబడఁగా లక్ష్మణకవి దానిని సంపాదించుటకుగాను భగవంతుని బ్రార్థించుటయుఁ దమ్మరాయని శపించుటయుఁ గర్జం బని తలంచి అటనుండి చెప్పెడు కథలో నంతట నతని రావణుంగాఁ బోల్చి చెప్పుచుండెను.

అట్లు దమ్మన్న లక్ష్మణకవియొక్కమాన్య మాక్రమించుకొని దున్నించి దానికి పాలికాపుంచి తనయూరికిం దిరిగి పోయెను. ఇట్లు దమ్మన్న తనభూమి నాక్రమించె నని విని లక్ష్మణకవి మిక్కిలి విచారించి తన కాభూమికిగా నీయంబడిన పట్టా వెదకి తీసి యుంచి ముందు సామోపాయముచేతఁ గార్యసాధనము చేయుదునుగాక యని యోఁచించి దమ్మన్న యున్న గ్రామంబునకుం బోయి అతనియింటఁ గూర్చుండియున్న అతని పరిజనంబుతోపాటుగఁ దానును లక్ష్మణకవి ప్రచ్ఛన్నుం డై కూర్చుండి యుండె. అపు డాదమ్మరాజుపరిజనములు ఏవోకొన్నివ్యర్థలాపంబు లాడుకొనుచుండఁగా విని లక్ష్మణకవి తనవిశేషములు స్పష్టీకరించు తలంపున నీక్రిందిపద్యములం జదివె అవి యెట్లన్నను.

"మ. ఏ-నిను నాశ్రయించి హృదయేప్సిత మెల్లను దీర్చుకొందునన్
       పూనికఁ జేరవచ్చిన ననున్ గడకంటను జూడవేమి యిం
       పూనఁగ మాటలాడుటకు నొప్ప వి దేమిచలంబు వద్దిఁకన్
       మాననిరూఢ సత్కృపను మన్పుము దమ్మన యిమ్ముమీఱగన్.

క. నగు మొగముతోడ నను దయ, యిగురొత్తఁగఁ జూచి తాల్మి నెదవేడుక మీ
    ఱఁగ లంక విడిచి యానం, దగరిమ మానదగ దీవనను బొందఁగదే"

అని పల్కి నిజసామర్థ్యంబు ప్రకటించువాఁడై యిట్లనును.

"గీ. ఒనరు మద్వాక్కులం దెలుంగునకు బద్ధుఁ, డగునువాగనుశాసనుఁ డైన నమ్ము
     మలఘుమద్దివ్యగోచయంబులకు బద్ధుఁ, డగును శ్రీమనోవసుచోరుఁ డైన నిజము.

క. తెలియ విను రామకావ్యా, దులు సూరకవిప్రముఖపృథుప్రతిభావం
    తులు భీమశ్రీనాథు, ల్వెలయఁగ నాకరణిఁ దిట్ట లే రూఢమతిన్.