పుట:Kavijeevithamulu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

406

కవి జీవితములు.

గీ. లక్ష్మణుఁడు లంకాపతి లక్ష్మణాగ్ర, జుఁడు కవనచారి గోపాలసూనుఁ డజసు
    వంశజాతుఁడు రాజాంబవత్స పిండి, ప్రోలికవివరుఁ డనుపేళ్లఁ బొదలుమీవు.

అని యి ట్లెన్మిదిపే ళ్లుంచి కవిత్వముఁ జెప్పు మనియుం జెప్పిన ట్లున్నది. ఇదియంతయు స్వప్నగతార్థమే కావునఁ బాఠకులు దేని నెట్లు గ్రహించినను గ్రహింపవచ్చును.

అని యిట్లు స్వప్నంబున తండ్రి యాజ్ఞ కాఁగా లక్ష్మణకవి మేల్కాంచి తనహితులకు తనస్వప్నంబు తెలిపి తాను పింగళిసూరన మొదలగు కవులవలె ద్వ్యర్థికావ్యము రచియింపఁగలనా యని వారితోఁ దెల్పఁగా వారు తన్నుంగూర్చి యీక్రిందివిథంబుగాఁ బల్కి రని చెప్పె. ఎట్లన్నను :-

"చ. గణుతికి నెక్కునట్టి ఘనకావ్యము లొప్పుగఁ జేయ శాస్త్రని
      ద్గణములు మెచ్చ భావములు కల్పనసేయ రసంబు లొప్ప భా
      షణముల కర్థగుంభనము సమ్మతి సేయఁగఁ బిండిప్రోలిల
      క్ష్మణకవివర్య నీవె తగుజాణుఁడ వన్యులు నీసమానులే.

క. శ్రీమన్నారాయణకరు, ణామహిమప్రాప్తసహజనవరసభావా
    ర్థామలవాగ్విలసనుఁడవు, సామాన్యకవీశ్వరుఁడవె చర్చింపంగన్".

ఇట్లుగాఁ బైని చెప్పిన పద్యయుగళములో లక్ష్మణ కవికవితా విశేషములుగొన్ని బోధపడుచున్నవి కావున నిఁక వానింగూర్చి మనము వేఱుగ వ్రాయవలసినయవసర ముండదు. ఇట్లుగాఁ దనమిత్త్రులుగూడ గ్రంథరచనకుఁ గాను తన నుత్సహింపఁజేయుటచేతఁ దాను గ్రంథము చేయనారంభించితి ననియునుఁ అందులోఁ దన కథ రామకథతోఁ జేర్చి చెప్పుటచేతఁ దన కైహికఫలప్రాప్తికల్గుటయకాక ఆముష్మికిఫలమును గల్గునని నిశ్చయించుకొని గ్రంథారంభము చేసెను. అందలి లక్ష్మణకవి చరిత్రసంగ్రహ మిపుడు మనము వివరింపవలసియున్నది. ఆ దెట్లన్నను.

కథాసంగ్రహము.

లక్ష్మణకవితండ్రి యగుగోపాలమంత్రి రావుమహీపతిరాయాజ్ఞ చేతఁ గుయ్యే రనుగ్రామములో నధికారము చేయుచుండెను. అతనికి