పుట:Kavijeevithamulu.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామరాజభూషణకవి.

385

కొని తానే రాజ్యంబుచేయుచుండెను. ఇట్లు కొన్నిదినంబు లుండి యా సంస్థానంబునకుఁ దానె ప్రభుం డై యుండ మదిఁ గోరి తనసంరక్షణమున నున్న సదాశివరాయనికి విషప్రయోగంబు సేయించె. ఇట్టిద్రోహ కార్యంబు చేసి తా రాజ్యంబు జేయఁదలంచిన నది దైవంబునకు సమ్మతంబు కాదయ్యె. కావున నీతని సంహరింపఁ దగు నుపాయంబు లూహింపఁబడియెను :-

రాష్ట్రంబులోని జనులందఱుఁ గృష్ణరాయనియల్లుం డగునళియ శ్రీరామరాజును సింహాసనం బధిరోహింపుఁ డనియు, దాము సహాయ మొనర్చెద మనియుఁ బ్రార్థించిరి. ఈరాజు కృష్ణరాయని యనంతరమే రాజ్యమునకు రా నిశ్చయించి యుండఁగా నల్కయతిమ్మరాజు విఘ్నంబు కల్పించి యచ్యుతరాయనికి రాజ్యమిచ్చెను. ఈరామరాజునకుఁ బట్టాభిషేకకాలంబునఁ గల్గినవిఘ్నంబు సూచించి వసుచరిత్రంబున నొకపద్యంబు చెప్పఁబడియెను. అదియెట్లనిన :-

సీ. పట్టాభిషేకవిపర్యయంబునఁ బ్రోలు, వెడలి ప్రియానుజు ల్వెంటఁ గొలువఁ
    జిత్రకూటాభిఖ్యఁ జెలఁగుఁపెన్గొండసాం, ద్రహరిద్విపేంద్రనా దవనిఁజెంది
    ఖలజనస్థానవాసులఁ బల్వురవధించి, మహిమ సలక ఖరస్మయ మడంచి
    హరివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప, దురమునఁ గదిసి తద్ద్రోహిఁ దునిమి

గీ. యనఘతరపార్థి వేందిర నధిగమించి, సాధుకర్ణాటవిభవసంస్థాపనంబు
    పూని శరణాగతులనెల్లఁ బ్రోచె రాముఁ, డతఁడునిజచరితంబురామాయణముగ.
                                                               (ఆశ్వా 1. ప. 44.)

ఈ వృత్తాంతమునే నరసభూపాలీయంబునంగూడఁ జూడనగు. ఆ కవియు నీతనిపేరు చెప్పి యుండుటకుఁ గారణంబు కలదు. దాని ముందు వివరింతము, ఈరామరాజు నల్కయ తిమ్మని జయించి యింకఁ గొన్ని దేశములు స్వాధీనము చేసికొనినట్లు నరసభూపాలీయమున నున్నది.

సీ. ఖలు నతిద్రోహు సల్కయతిమ్మని హరించి, సకలకర్ణాటదేశంబు నిల్పె
    నతుని వర్ధితునిఁ దత్సుతునిఁ బట్టము గట్టి, కుతుపనమల్కన క్షోణి నిలిపె
    పదిలుఁ డై రాచూరుముదిగల్లుకప్పంబు, సేయఁ గాంచి సపాదుసీమ నిలిపె
    శర ణన్న మల్కనిజామున కభయం బొ,సంగి తదీయరాజ్యంబు నిలిపె