Jump to content

పుట:Kavijeevithamulu.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

333

అందు నన్నయభట్టుశైలి అతిసులభమైనదియు నెఱ్ఱాప్రెగ్గడ శైలి అతి కఠినమైనదియు నై యున్నది. తిక్కనసోమయాజి శైలి యీయుభయ విధముల నుండునది. కవిత్వప్రౌఢిమలో నన్నయభట్టు మిక్కిలి నేర్పరి కానివానివలెఁ గాన్పించును. తిక్కన యెఱ్ఱప్రగ్గడలు ఇంచుమించుగా సమర్థులుగాను సమానులుగాను గాన్పించుచున్నారు.

3. ఉ. తర్వాతికవులు కొందఱు ప్రయత్నించి యాశైలి నవలంబించి గ్రంథముల వ్రాసియున్నారు.

చా. కవిత్వముం జెప్పువారు ఇతరులశైలి నవలంబించి వ్రాయుట యుండనట్లుగా నాత్మానుభవమునఁ జెప్పవలసియున్నది. కవిత్వప్రారంభసమయములో నందఱిశైలియును గొంచెము కఠినపదయుక్తముగాను, కఠినాన్వయయుక్తముగాను, నాతిమధురముగా నుండుట స్వభావము. పోవంబోవ గఠినపదప్రయోగమునం దిష్టముగలవారికవనము అతికఠినముగాను సులభపదప్రయోగము లిష్టముగా నుండువారి కవిత్వ మతిసులభముగా నుండును. ఇటులనే రసాలంకారములఁ గృషిచేయువారికవితయు నుండుననుటకు సందియ ముండదు. ఇట్లుండుటం జేసి మనము ఒకరి కవిత్వముంబోలి యొకరికవిత్వ మున్న దని గాని యొకరివర్ణ నలం జూచి యొకరు వర్ణనలం జేసి రని గాని యూహింపఁ గూడదు. చమత్కారార్థముగా నెవ్వరైన మహాకవి చెప్పిన వర్ణనాంశముల నంతకు నెక్కు డగురసము పుట్టింపఁగోరి మఱికొందఱు మహాకవులచేతం బ్రయత్నింపఁబడినను అంతమాత్రమున నాయిర్వురు నొక్క శైలి వా రనిగాని లేక వారినుండి వీరు దొంగిలి రని గాని చెప్పుట కవిత్వపరిపాటిలోనిది కాదు.

4. ఉ. పూర్వకవులు వలయుచోటుల సంస్కృతముం దెచ్చి పెట్టిరి. కాని గ్రంథముల నెల్ల సంస్కృతభూయిష్ఠములు చేసి యుండలేదు, తర్వాతి కవులు వ్రాసిన గ్రంథములయం దాంథ్రచిహ్నము లించుకైనను లేవు.

చా. దీనికిఁ గారణ మాలోచింపక పోరాదు. పూర్వకవులు సంస్కృతముం దెనిఁగించుచోఁగూడ సంస్కృతము లుంచియుండఁగా సం