పుట:Kavijeevithamulu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

295

సూరనకవివంశచారిత్రము.

మూలపురుషుఁడు పింగళి గోకమంత్రి.

ఈగోకమంత్రి సూరనకవివంశజులకు మూలపురుషుఁ డని యీ వఱకే చెప్పియున్నాఁడను. అతఁడు ప్రథమమున సంతానము లేక సూర్యదేవో పాసనఁ చేయుచుండఁగా నాసూర్యుఁడు గోకమంత్రిభార్య స్వప్నమున నొకబ్రాహ్మణవేషముతో వచ్చి యగపడి యొకదొండచెట్టు చేతికిచ్చి యీచెట్టు భూమిలో నాటి పెంచితివేని యిది ఫలింపఁగల దని చెప్పెనఁట. అటుపిమ్మట నాగోకమంత్రి కనేకులు పుత్త్రులు కల్గి అతనివంశము దొండతీఁగె శాఖోపశాఖలుగా నల్లుకొనురీతినే పుత్రపౌత్రపరంపరలచేఁ బ్రకాశించెను. ఇట్టిగోకమంత్రిసంతతి కొన్నితరము లైనపిమ్మట ననేకస్థలములలో స్థిరపడి ఆయాగ్రామములే వంశ నామమునుగా ధరించిరి. గోకనమంత్రి యుండునూర నుండువారికి మాత్రము పింగళివారను గృహనామంబు నిల్చియుండెను. అనంతరకాలములో నీపింగళివారు కొందఱు గోదావరీతీరమందును, మఱికొందఱు కృష్ణాతీరమందును, పింగళిరామయ మొదలగువారు పల్నాటి సీమలోను, పాకనాటిసీమలోను, పింగళిగాదయాదులు గోకనమంత్రి యున్న చోట నుండిరి. సూరకవి మొదలగువారును గోకమంత్రికి నింటిపే రైనపింగళి యనుస్థలము ననే యుండి ప్రసిద్ధులైరి.

పేకికథ.

పిదప పింగలిగోకమంత్రి పేకి యనుగంధర్వస్త్రీని వశపఱచుకొనిన ట్లొకగాథ దేశములో వ్యాపించి యున్నది. అయితే ఆకథ జనసామాన్యముగఁ బిశాచపుకథగా వాడుకొనంబడుచున్నది. కాని మంత్రయోగు లిట్టిగంధర్వవిద్యల వశపఱచుకొని వానివలన ననేక చమత్కార కార్యములఁ జేయించుట కలదు. యక్షిణీవిద్య యిట్టిశాబరదేవతోపాసనమూలముగనే చేయుచుండెదరు. యక్షిణి యనునామమునకు యక్షభార్య యని పేరు. అట్టియక్షణులు పరివారముగాఁ గల్గుదేవతలు