పుట:Kavijeevithamulu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పింగళిసూరన.

293

లఁ జెప్పికొన్నాఁడు. అందు మొదటిది పితృభక్తి యని యీక్రిందిపద్యమువలనఁ దెలియును.

క. తండ్రియ సుతులకు దైవం, బండ్రుగదా వేదవాదు లని వినియును నే
    వీండ్రను వాండ్రనుబలెమా, తండ్రిఁ బరమపూజ్యుఁ గాఁగఁ దలపమి తగునే.

ఇఁక రెండవకారణము తనకంటెఁ జిన్న యగుతనతమ్ముండు గయావర్జనాదికముం జేసి పితృఋణవిముక్తుండు గాఁగఁ దా నట్లు చేయ లేనైతి నని చింతించి పిదప తండ్రివంశమును వర్ణించి తన్మూలముగఁ దన తండ్రిని శాశ్వతనామునిఁ జేయుతలంపయియున్నది. దానిని సూచించుట కీక్రిందిపద్యములు వ్రాయఁబడినవి.

మ. గయలోఁ గాశి ప్రయాగ శ్రీగిరిని గంగాద్వార నీలాచ లో
     జ్జయినీ ద్వారకలం దయోధ్య మధురన్ సంస్తుత్యపుణ్యస్థలా
     గ్రియతన్ వెండియు మించునైమిశ కురుక్షేత్రాదులం దర్పణ
     క్రియచే నాపినతమ్ముఁ డెఱ్ఱన యొనర్చన్ దండ్రి కాహ్లాదమున్.

క. ఏను నుచితపూజను నా, చే నైన ట్లెద్దియైనఁ జేయఁగవలయున్
    గానఁ గృతి నిచ్చి మేదిని, పై నెఱపుదు నతనికీర్తి పరమేశుకృపన్.

సూరకవివంశావళి.

ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁ డైనట్లును, గౌతమగోత్రుఁడైనట్లును, ఇతనివంశనామము పింగళివారనియు సూరనయే చెప్పియున్నాఁడు. ఇతనివంశమునకు మూలపురుషుఁడు పింగళి గోకనామాత్యుఁడు. ఇతఁడు "పేకి" అనునొక క్షుద్రగంధర్వ స్త్రీని దాసిగాఁ జేసి కొనియె. నాఁట నుండియు నది "పింగళివారిపేకి" అని పిలువంబడుచు వచ్చెను. ఈపేకివృత్తాంతము గోకనామాత్యచరిత్రలో వ్రాసెదను. ప్రస్తుతమున సూరకవి వంశవృక్షము నీక్రింద వివరించెదను.