పుట:Kavijeevithamulu.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

కవి జీవితములు

పే శ్రీనాథకవిని సింగనామాత్యుండు నడిగినట్లున్నది. శ్రీనాథుఁడును దాని కుత్తరము గ్రమముగనే లోకములోని కవులంబోలి యిచ్చియున్నాఁడు. అంతకంటె నధికప్రసంగమున కవసరము లేదు. ఇట్లుండఁగా నిఁక లోకములో వ్యాపించియుండుగాథ మిక్కిలి నింద్యముగాను, లోకానుభవముచే సందర్భహీన మైనదిగా నుండును. అట్టికథకు మూలము శ్రీనాథకవి స్త్రీలోలుఁ డని లోకములోఁ గలమూఢజనాభిప్రాయమై యున్నది. అట్టియభిప్రాయము నదియైనది కాదని నుడివి ముప్పదియిద్దఱునియోగులచరిత్రములో వివరింపఁబడినవృత్తాంతము నీక్రింద వివరించి పూర్వపక్షము చేసెదను. ఎట్లన్నను :-

శ్రీనాథుఁడు శృంగారనైషధము రచియించి రాచవేమన యను వేమారెడ్డికిఁ గృతి నీయం గమకించి యతఁ డున్న యూరునకుఁ బోవుచుండఁ ద్రోవలో నొకవర్షము సంతతధారగాఁ గురియఁ బ్రయాణంబు నిలుపు చేసి తనయానంబుతో నీ మామిడిసింగనామాత్యుఁడు కరణముగా నున్నగ్రామమునకుఁ బోయి యుండెనఁట; అపు డాసింగన శ్రీనాథుని రాక విని యతనిం జూడఁ బోయి యాదినంబు తనయింట విడిసి తనగృహంబు పావనము చేయుఁ డని ప్రార్థించెనఁట! అపుడు శ్రీనాథుం డట్ల యని సమ్మతించి రాఁ గని సింగన యాదినము తనపితృకార్యార్థమై సమకూర్చియుంచినవిశేషపదార్థము లన్నిటితో శ్రీనాథునకు ముందుగ భోజన మిడి యనంతరము మఱికొన్ని పదార్థములు దెచ్చి తనపితృకార్యంబు నెఱవేర్పుడు, శ్రీనాథుం డట్టిమన్ననకు మిగుల సంతసించి యుండెనఁట. సింగన శ్రీనాథునిఁ దనయింట భోజనమునకు నిల్వుఁ డని కోరినయుదయము వేళనే శ్రీనాథుఁడు తన కారాత్రి యొక వేశ్యం దెప్పించి యిచ్చినం గాని తా నతనియింట భుజియింప రా నని నుడివినట్లును, ఈసింగన యట్లు తాను సమకూర్చెద నని యనుటచేతనే శ్రీనాథుఁ డాతనియింట భుజియింప నంగీకరించె ననియుం గలదు. ఆరాత్రి కల్గినవర్షప్రతిబంధమువలన నీసింగనమంత్రి వెలయాలిం దెచ్చి గూర్చుట