పుట:Kavijeevithamulu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కవి జీవితములు



రాజున కొకవిన్న పం బని యిట్లనియె. "దేవర రామకృష్ణునివృత్తాంత మంతయు నెఱుంగుదురు గద. ఇట్టిదుష్టుఁడు ముందు తమసభ కేతెంచిన నాకష్టంబు గట్టెక్కదు. కావున నాతని నాఁటిదినంబు సభకు రా కుండ నుత్తరం బొసంగవలయు." అనుడు రాయఁడు రామలింగనిచేష్టల నాలోచించి "పరరంధ్రాన్వేషి యగునీతం డెద్దియైనఁ బల్కనోపును. అపుడు నామది కెట్లు దోఁచునో? కావున వీని నాఁటిసభకు రాకుండ నుండుటయే కర్జం" బని తనభటులకు నట్లుత్తర మొసంగి రామలింగనికి నట్లాజ్ఞ యొసంగె. అట్టిరాజాజ్ఞకు మిగులఁ గుపితుం డై రామకృష్ణుండు తనలోఁ దా నిట్లు చింతించె. "హా! భట్టెట్టి సాహస కార్యం బొనర్చె. ఏ నెన్నండేనియు వీనికిఁ గీడు దలఁచి యుంటినే? ఇట్టి నన్ను నిష్కారణవైరంబున నవమానింపఁ దలంచె. తన్నుఁ గట్టు త్రాళ్లు తాన తెచ్చికొన్నట్లు నాకు భంగంబు సేయఁదలంచె. ఈతని ప్రబంధంబున కేదియేని యంతరాయంబు గల్పించి రాజు వినకుండ నుండునట్లు సేసదఁగాక" యని యిష్టదేవతకు నమస్కరించి తా నొక ముదుసలియుప్పరివేషంబు దాల్చి సభామండపసమీపంబునఁ బనిసేయు నుప్పరులం గూడి యుండెను.

అంతట శుభదినంబునఁ ప్రభునియూడిగంపుజనులు సభకు నలంకరణం బొనరించిరి. రాజును సర్వసేనాపరివృతుం డై నిజవిభవం బేపార నేతెంచి కొలువు బలిసియుండె. అపుడు రామభూషణుండు తననేరువు సభ్యులందఱకు విస్పష్టంబు సేయఁదలంచి యొకయున్న తాసనంబునఁ బ్రభుసన్నిధిం గూర్చుండి యొప్పిదంబు లగుగీతంబుల మంగళగీతంబులు పాడుచు స్వకృతకృతిముఖశ్లోకంబున సుశ్లోకుం డగుకాకుత్ స్థతిలకు వర్ణించిచెప్పిన "శ్రీభూపుత్త్రి వివాహవేళ" అనుపద్యంబు చదివె. అపుడు దూరంబున నుండి యాఁగుఁ డాఁగుఁ డని" యొక్కధ్వని వీ తెంచె. అట్టి ధ్వని కర్ణగోచరం బైనతోన సభికులందఱును నుల్లంబులు తల్లడిల్ల నివ్వెఱఁగంది యుండిరి. నిశ్శబ్దంబుగ నున్న సభామధ్యంబునకు