పుట:Kavijeevithamulu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కవి జీవితములు



భట్టుమూర్తిం జూచి యాతఁ డిట్లనియె. "ఓయీ! నిన్నుం జూడఁజూడ నీకవితసరసతయుఁ బ్రజ్ఞావిశేషంబులు నుతియింప నుత్సాహంబు వొడముచున్న యది నీప్రజ్ఞావిశేషంబు లల్పంబు లే?

"గీ. అలసాని పెద్దన యల్లికజిగిబిగి, ముక్కుతిమ్మనార్యు ముద్దుపల్కు
     పాండురంగవిభుని పదగుంభనంబును, కాకమానురాయ ! నీకుఁ దగుర.

అను రామకృష్ణునిమధురవాక్యంబులు వీనులకు నమృతంపుసోనలై సోఁకిన భట్టుమూర్తి పెల్లుబ్బి వెల్లువయై పాఱునానందంబునం దేలి నిజకంఠలగ్న తారహారం బూడ్చి యాతనిమెడ నిడి గాఢపరీరంభ మాచరించి లోనికిం దోడ్కొని చని యున్నతాసనంబునం గూర్చుండఁబెట్టి, యర్ఘ్యపాద్యంబు లొసంగి కర్పూరతాంబూలం బందిచ్చి "యిదియే నేస్తంపు విడెం బని తెల్పెను. రామకృష్ణుం డట్లే దానిఁ గై కొని పోయివచ్చెద నని తెల్పి నిజగృహంబున కేతెంచి తనరాక కెదురుచూచు చున్న పండితులం గాంచి, "యిదె మీహారంబు మీయిష్టానుసారంబుగ దీని వాడికొనుం డని వారిపైఁ బడవై చె. దానికి వారందఱును గడు సంతసిల్లి "యోయీ దీని హరింపను ధరింపను నీవ సమర్థుండవు. కావున నీకు దీని మేమందఱము బహుమానంబుగ నిచ్చితి మని యతనిమెడ దాని నుంచి యథేచ్ఛం జనిరి.

ఇట భట్టుమూర్తి యప్పుడే రాజదర్శనార్థము చని తనరాక యాతని కెఱింగించి వుచ్చిన నాతఁడు భ ట్టిట్టిసమయంబున వచ్చుటచే నాతని కెద్దియేని యాపద సంభవించుటగా నిశ్చయించి దిగ్గన లేచి వచ్చి నీరాకకుఁ గారణం బే మని యడిగెను. అపు డాతఁడు నవ్వుచుఁ జిన్న విన్న పం బన రామకృష్ణుఁడు స్నే హార్థియై వచ్చిపల్కినపల్కు లన్నియుం దెల్పె. వాని విని రాజును గడు సంతసించి యీతఁ డొక్కఁడు మనవాఁడై యుంటంజేసి తక్కుంగలపండితుల నశ్రమంబునఁ గెలువ వచ్చును. మన కీదినంబు మిగుల సుదినంబు. ఎల్లి యెల్లవృత్తాంతంబు మాటలాడుదము చను మని యా రాత్రి నిద్రించి మఱునాడు రాత్రి