పుట:Kavijeevithamulu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెనాలి రామకృష్ణకవి.

207



ను జూపి తా నూర్ధ్వగామి యయ్యె. అపుడు సభ్యు లందఱును భయకంపితాంగు లగుచు లేచి దయ్యము దయ్య మని యొక్క పెట్టున బొబ్బ లిడుచు నలుఁగెలంకులఁ బరువు లిడిరి. అపుడు రామకృష్ణుఁడు దీపము సూపక శిలావృష్టిం గురిపించెను. అపుడు సభ్యు లాదెబ్బలకు నబ్బ బ్బా యని యిఁక నేటిపురాణము? లేచి రండు రం డనిరి. వారును బురాణము చాలించి దూరమున నిలువంబడి యిట్లుచింతించిరి. ఆహా ! యిది యెద్దియో ప్రళయమునకు సంభవించినమహాభూతమురీతి నున్నది. ఇఁక నేమియుపాయము ? నిక్కముగా నిది యొక్కబొమ్మరక్కసి యగును. ఈవఱకు మనరాజేంద్రుఁడు నీగురువులవారు నొకబ్రాహ్మణుని నిష్కారణముగాఁ జంపించియున్నారు. అది యూరక పోవునే? అధికార మున్నది గనుకఁ జంపించవచ్చును గాని తత్ఫల మనుభవింపక తప్పించుకొన నలవిగాదు గదా ! బ్రహ్మరక్షస్సు కులాంతమునఁ గాని చలమువిడువ దని పెద్ద లనెదరు. ఏమి కాఁదలచి యున్నదోఁ ముందు భగవంతునకుఁ దెలియును. అని యట్లు సభ్యులు చింతించుచుండఁగా రాజు మాంత్రికులం బిలిచి దానికిఁ బ్రతీకార మొనరింపుఁడనుడు వారును జంకి రాజసన్నిధానమున నుండుటంజేసి కొంత భీతి వదలి భూతి చేతం గొని ఆగచ్ఛ ఆదచ్ఛ యని కేకలు వేయుచు భూతిం జల్లుచుఁ గొంతతంత్రము గావించి తుదిఁ జేయునది లేక రాజుతోఁ బ్రత్యూషమున సుస్నాతులమై యీ భూతమునకు వలయుమారణోపాయములఁ జూతుము. ఇపుడు పనివినియెద" మని నిజవాసములకుఁ జనిరి. రాజును సభ్యులఁగూడి చనియె. రామకృష్ణుఁడును గుప్తవేషుండై వృక్షము డిగి యిలు సేరెను.

రామకృష్ణుఁడు రాజదర్శనము సేయుట.

మఱునాఁడు కృష్ణరాయఁడు కాల్యకృత్యములు నిర్వర్తించి కొని పేరోలగం బుండి ద్విజోత్తముల రావించి గ్రహమారణోపాయం బన్వేషింపుచుండెను. ఇట రామకృష్ణుఁడు వేకువ లేచి సుస్నాతుఁడై