పుట:Kavijeevithamulu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

కవి జీవితములు



గుము. దానిచే మనకుఁ గొంతధనము రాఁగలదు. అని వారిం బనిచిన, వారును రోదనము సేయుచు రాజుం గాంచిరి. అపు డతఁడు కరుణాతరంగితాంతరంగుడై తత్కాలక్రియలకుఁ గొంతరొక్క మిచ్చిమాసవేతనమును నియమించెను. ఈవృత్తాంత మంతయుఁ దెలిసికొని రామకృష్ణుఁడు నిజమాయోపాయములకు నలరి గ్రానవాసోదైన్యము లేక సుఖముగ నుండెను.

రామకృష్ణుఁడు పిశాచవేషమును ధరించుట.

ఇట్లుండ నొకయాఱుమాసములు గడచినవి. ప్రచ్ఛన్నుఁడై మిద్దెయింట నుండి రామకృష్ణుఁడు రక్కసిక రాట మొకటి లక్కతోఁ జేయింపఁ దనవారల కాజ్ఞ యొసంగెను. తానును స్వర్గవిశేషదర్పణమనునొకగ్రంథము రచియించుచుండెను. తూర్ణమ యారెండును సంపూర్ణము గాఁ గని చీలమంలల నంటునొకనీలకంచుకము గుట్టించెను. ఇట్టివస్తుసమితిం బూని యొకనాఁటిరేయి మధూచ్ఛిష్టపువత్తియు గుగ్గిలపు తిత్తియుఁ బదిలంబు సేసికొని యొకగుడ్డపేలిక నగ్గి దగిల్చి యొడినిండఁ జిఱుతఱా లుంచుకొని నిజగృహము వెడలి తత్సమీపమున నున్న బహుపాద్విటపివిటపాగ్రమునకు నెక్కి యొరులకుఁ గానరాకుండ నడఁగి మడఁగి యాకులచాటు పిందెకైవడి నుండెను. ఆవాసరము హరివాసర మగుడు నుపవాసమునఁ గృష్ణరాయఁ డచ్చోఁ బండితజనపరివేష్టితుఁడై వచ్చి నిలిచెను. అపు డాచార్యుఁడు భాగవతము చదువ నారంభించి హరికథాసుథారసమున సభ్యులమనస్సును దనియింపుచుండెను. అట్టి సమయమునఁ బై నున్న రామకృష్ణుఁడు కంచుకము దొడిగి కరాటము శిరో వేష్టనముగ నమర్చి చేత నున్న యగ్నినిఁ బ్రజ్వరిలం జేసి వత్తి ముట్టించి క్రిందికిఁజనుదెంచి యూడలసమీపమునఁ గూర్చుండి పండితులపై ఱాలవాన గురిపించెను. వార లదియెద్ది యని తలలెత్తి మిన్నుం జూడ రామకృష్ణుడు తనచేత నున్నదీపము గుగ్గిలముచేఁ బ్రజ్వరిలం జేసి కరాటమున నున్నకరాళవక్త్రమును భీషణదంష్ట్రలును మిడిగ్రుడ్ల