పుట:Kavijeevithamulu.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కవి జీవితములు



మెవరు గలరు. తల్లి విషమిడినను, తండ్రి ధనికుల కమ్మఁ జూపినను బిల్లలకు దిక్కెక్కడిది?" అని దీనాలాపంబులఁ బ్రార్థించిన నెట్టకేల కాయమ్మ కరుణించి "వికటకవి వయ్యు రాజసన్మానము గాంచెదవు రాజ సభాభూషణంబ వయ్యెద" వని వర మిచ్చి యంతర్హిత యయ్యెను.

తాతాచార్యులఁ జూచుట.

అపుడు రామకృష్ణుఁడు నిజనివాసంబున కేతెంచి నివుఱు గప్పిన నిప్పువలెఁ దనసామర్థ్యము గుప్తము సేసికొని కొన్నిదినము లుండెను. అనంతర మొకనాఁ డిట్లు చింతిచెను. నాకుఁ గాళికాదేవి రాజసన్మానము గల్గు నని వర మిచ్చినది. దాని కేమి? ముందుగఁ తత్సాన్నిధ్యమునఁ బ్రవేశము గల్గు టెట్లు? ఇంతియ కాక నేను విద్వాంసుఁడ నని యొరు లెఱుంగనిసమయమున నానామము వ్యాపక మౌట కేది యుపాయము? "అందలిమ్రానిపండ్లకు నఱ్ఱు చాఁప నేల?" యని యూరకున్నచో భుక్తిముక్తు లలవడు టెట్లు? ఎట్లైనను రాజానుగ్రహము సంపాదించుట ముఖ్యము." అని రాజగురుఁ డగుతిరుమలతాతాచార్యుల (లక్షగోదానముల తాతాచార్యులను)జూడఁ జని తనయభీష్ట మెఱిఁగించెను. అతఁడు సమయ మగునపుడు కార్యము చేసెద నని తెల్పెను. నాఁట నుండియు రామకృష్ణుం డహరహమును తాతాచార్యులఁ జూచుచు వేఁచియుండెను, ఇట్లు చిర కాలమయ్యెను. అంత నొక్కనాఁడు రామలింగము తనలోఁ దా నిట్లు చింతించెను. అద్దిరే తాతాచార్యుం డెంత మోసగాఁడు.

తాతాచార్యుని మోసపుచ్చుట.

తత్కాలోపయోగము లైనకొన్నిమాటలాడి తుదిఁ దన్నుంగాదన్న ట్లూరకున్న వాఁడు. సమయము వచ్చిననేకాని యెవ్వరిస్వభావమును దెలియఁబోదు. ఇట్టిమోసగానియెడ నయం బనయంబును గూడనిపని