పుట:Kavijeevithamulu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

కవి జీవితములు



గ్రంథమునే కైకొనుతలంపున "నెవరు ముందు దెత్తురో వారికృతిని గ్రహించెదను" అని చెప్పి పంపెను. అప్పటికి రంగనాథుని రామాయణము మూఁడుపాళ్లు తీరియుండును. కనుక నితఁ డది ముగియుటకు ముందే తనరామాయణమును ముగించి కొనిపోవ నెంచి మీఁదఁజెప్పిన ముగ్గురిసహాయముచేతను త్వరితముగా ముగించుకొని పోయెను. అప్పటికి రంగనాథుడు తనరామాయణమును ముగించి యా స్థానమునకుఁ దెచ్చియుండెను. అది చూచి రంగనాథునితట్టు కుడిచేతిని భాస్కరునిత ట్టెడమచేతినిఁ జాఁచెను. అందులకు భాస్కరుఁడు కోపగించుకొని "పక్షపాతము గలనీవంటిరాజునకు నిచ్చుటకంటె నాకృతి నొకగుఱ్ఱపువాని కిచ్చుట మేలు" అని పలుకుచు నాస్థానమునుండి వెడలి పోవుచు నుండఁగా నా రాజుయొక్కగుఱ్ఱపుదళవాయి "కవిసార్వభౌమా! ఆడినమాట తప్పవలదు" అని దారికి నడ్డముగా వచ్చి మ్రొక్కెను. అంత నతఁడు వానికిఁ దనకృతిని నంకితముం జేసెను. కనుకనే యీగ్రంథాదియందు "సాహిణిమారా" యని సంబోధించి చెప్పఁబడి యున్నది. దీనిలోఁ గొన్ని యంశములంగూర్చి మనము చెప్పియుంటిమి గావున దీని నిపుడు విమర్శింప నవసరము లేదు. మనవిమర్శనమునకు వ్యతిరేకింప నది యంతయు మనయభిప్రాయము ననుసరించి యున్నట్లు గ్రహింపదగును.

రంగనాథరామాయణము.

రామాయణగ్రంథము పురాణము లన్నిటికంటెను ముందుగాఁ దెనిఁగింపఁబడినది. దీనినిఁ బెక్కండ్రు పెక్కుభంగులఁ దెనిఁగించిరి. వారిలో రంగనాథరామాయణగ్రంథకర్త మొదటివాఁడు. ఇతఁడు దీనిని ద్విపదగఁ దెనిఁగించెను. ఇది నెల్లూరిజిల్లాప్రాంతమున సర్వజనులకు వీథిపురాణముగ నుండెను. దీనిశైలి మృదువు గావున దీనిని జను లందఱును మిగుల నాదరంబుతోఁ జదువుదురు. ఇది కోనబుద్ధభూవిభునిచేతఁ దెనిఁగింపఁబడి యతనితండ్రి యగు విఠ్ఠలరంగనాథునకుం గృతి యియ్యఁబడినది. కావున దీనికి రంగనాథ