పుట:Kavijeevithamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

కవి జీవితములు

వేములవాడగ్రామములో నొకబ్రాహ్మణుఁడు కాఁపురము సేయుచుండెను. ఆయన కొకకూఁతురు సంతానము లేక వగచు కాలమునఁ గలిగినది. అట్టిశిశువుం జూచి యాబ్రాహ్మణుఁడు మిక్కిలి ప్రేమతోఁ బెంచుచుఁ బెద్దదానిం జేసి వివాహసమయము తటస్థింపఁగానే యొకానొకబ్రాహ్మణకుమారునికి విద్యాబుద్ధులచే నొప్పువాని కిచ్చి వివాహము చేసెను. ఆచిన్న దాని కత్తవారియింటికి వెడలుప్రాయము వచ్చు వఱ కాచిన్న దానిభర్త కాలధర్మము నొందెను. అపు డాచిన్నది విశేషదుఃఖముతో నుండ నాచిన్న దానితలిదండ్రులు దానిని బుజ్జగించి తమయింటనే యుంచుకొని పోషించుచుండిరి. ఇట్లుండఁ గొంతకాల మతిక్రమించినది. ఒకానొకసమయమున నాయూరనుండు మఱికొందఱు బ్రాహ్మణస్త్రీలు శివరాత్రినాఁడు తత్పర్వంబునకై యాసమీపముననే యున్న దాక్షారామమునకుఁ జన నుద్యుక్త లయిరి. అపు డీబ్రాహ్మణునికూఁతురును వాండ్రతోఁ బోవఁ గమకించి తల్లిదండ్రుల నాజ్ఞ యడుగఁగా వారును గూఁతు రిహమునకుఁ గాకున్నఁ బరమునకైనఁ దగుయత్నంబు చేయవలసినదే కావున దీనికి సెల వీయఁ దగు నని తగుధనం బిచ్చి వాండ్రవెంట దాక్షారామముకుఁ బంపిరి.

ఇటు లాబ్రాహ్మణస్త్రీ లందఱు దక్షవాటిం జేరి యచ్చోటున నున్న సప్తగోదావరములో స్నానము చేసి భీమనాథుని దర్శించి స్వ మనోభీష్టములం గోరుచు మ్రొక్కు లిడ సాగిరి. అపు డీ బాలరండయు స్వామికిఁ దనతోడియువతులు మ్రొక్కుటచూచి అవి సఫలము లగునా యయిన నేను మ్రొక్కెద నని యీశ్వరునిదిక్కు మొగంబై "ఓస్వామీ ! నాకు నీయట్టికుమారుఁడు పుట్టెనేని పుట్టెఁడునీరు దీపారాధనచేసి నాలుగుపుట్లయిసుక నై వేద్యము పెట్టెద" నన్నది. అట్టి దీని మనవి యా యీశ్వరుని కెంతయు నమ్మోదకారి యయ్యెనఁట. ఆహా ! ఏమి! ఈశ్వరుని విలాసము ! ఏమి ! యాభక్తసులభత ! ఇట్లు నలువురితో పాటు మ్రొక్కి యింటికి వచ్చి శయనించినయాబ్రాహ్మణ స్త్రీకి స్వప్నమున నాయీశ్వరుఁడు సాక్షాత్కరించి "ఓయువతీ ! నాయట్టిపుత్రుని బడ