పుట:Kavijeevithamulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

కవి జీవితములు

   జపహారకీరపుస్తకవిపంచిసమంచి,తంబు లేదేవిహస్తాంబుజములు
   కుందేందుమందారకందళీబృందంబు, చంద మేదేవియానందమూర్తి

గీ. కాంచె నేదేవి కాంచన గర్భచతుర, పూర్వదంతకవాట విస్ఫుటమనోజ్ఞ
   చంద్రకాంతశిరోగృహ స్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు.

అనియుండెను. కావున నీతఁ డుపాసించుదేవత యగుభారతి జగద్గురుశారదాపీఠవర్తిని యనియు, నట్టిభారతి నుపాసించిన భారతీతీర్థులే పినవీరనకు గురుఁ డనియును, పినవీరనకుఁ గల్గిన జ్ఞానవిశేషమున కాదేవతో పాసనయే కారణ మనియునుఁ జెప్పఁదగి యున్నది. ఇంతియకాక పైవర్ణనమును క్రిందిపద్యమును బరిశీలింపఁగాఁ బినవీరన మంత్రయోగ రహస్యములుగూడఁ బెక్కులు తెలిసినవాఁడుగాఁ గాన్పించును. ఆపద్య మెట్లన్నను :-

గీ. కరముగా భారతీ తీర్థగురుకృపాస, మిద్ధసారస్వతుఁడు సత్కవీంద్రహితుఁడు.

పై భారతీతీర్థులు శా. సం. 1250 లోఁ దురీయాశ్రమమును స్వీకరించి శా. సం. 1302 లో సిద్ధినందినట్లు శృంగేరిజగద్గురుపీఠాధిరోహణనిర్ణయపట్టికలో నున్నది. దాని నే నీవఱ కాచార్యకల్పవల్లిలోఁ బ్రచురించియున్నాఁడను. పినవీరన భారతీతీర్థులచరమకాలములో యోగోపదేశము నందియుండు నని తోఁచెడిని. అప్పటి కీతఁడు మిక్కిలి బాల్యవయస్సున నుండి యుండును. కావున నీపినవీరన శా. సం. 1300 మొదలు శా. సం. 1350 వఱకుఁ గలకాలమువాఁ డని నిర్ణయించెదను.

పినవీరన కుకవులయెడ మిగుల భీకరుఁడై యున్నట్లు పైగీతపద్యములోనియుత్తరార్థమువలనం గాన్పించును. అదియెట్లన్నను :-

"కుకవిమూర్ధ విలుంఠనకులిశహస్త, పల్లవుఁడు చెప్పెఁ బినవీరభద్రసుకవి.

పినవీరభద్రయ్యగోత్రవిషయము.

దీనింగూర్చి పినవీరభద్రకవిచే నేమియుఁ జెప్పఁబడదయ్యెను. కాని యతఁ డాంధ్రకవులంగూర్చి వర్ణించుచు వ్రాసినపద్యమువలన నీతనిగోత్ర మూహింపఁదగి యున్నది. ఎట్లన్నను :-