పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

22

- కవిజనాశ్రయమునకు జైనమతమునకును సంబంధము. -

జైనసంబంధము గలయాంధ్రగ్రంథ మీకవిజనాశ్రయ మొక్కటియె కనఁబడుచున్నది. కన్నడభాషలోని ప్రాచీన గ్రంథము లించుమించుగా నన్నియు జైనులు రచించినవియే. అఱవ భాషయందుఁ గూడ జైనకృతగ్రంథము లున్నట్లు తెలియుచున్నది. పూర్వకాలమందుఁ దెలుఁగుదేశమందును జైనమతము వ్యాపించి యున్నట్లు నిదర్శనములు గలవు. నాగవర్మ మొదలగు కొందఱు జైనకర్ణాటకకవులు తాము వేంగీదేశములో నుండి కన్నడదేశమునకు వెళ్లినట్లు చెప్పికొని యున్నారు. ఆకాలమందు జైనకృతాంధ్ర గ్రంథములుకూడఁ గొన్ని పుట్టియుండవచ్చును. అవి యేకారణమువలననో యింతవఱకుఁ బైటికి వచ్చియుండలేదు.

- కవిజనాశ్రయములోని కర్ణాటభాషాసంప్రదాయము. -

కృత్యాదిని సరస్వతీప్రశంస చేయుటయందును మఱికొన్ని విషయములందును నీగ్రంథముప్రాచీన కర్ణాటగ్రంథములమర్యాద ననుకరించి యున్నది. ఈ సామ్యముల నందందు గ్రంథమునం జూడనగు.

ఛందోవిషయము.

- గురులఘునిర్ణయము. -

గురులఘుసంయోగముచే గణములు పుట్టును. గణములకూడిక చేఁ బద్యము లగును. కావున గురులఘు నిర్ణయము