పుట:Kavijanaashrayamu-Chandashastramu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15

కవిజనాశ్రయము

మూర్తిగారిపాఠమునకుఁ బట్టిన మొదటి రెండుదోషములును బట్టవు, గాని, మూఁడవదోషము తప్పక పట్టును. భీమకవి యిట్టి దుష్టప్రయోగము చేయఁడు. చేయునని యూహించుట యసమంజసము.

ఈ హేతువులను బట్టి యీపాఠములు రెండును దప్పే యని నిశ్చయింపవలసి యున్నది. భీమకవి కళింగదేశపురాజు నాశ్రయించియుండెనని సర్వజనసమ్మతమైన ప్రతీతిగలదు. శ్రీరామమూర్తిగారు, వీరేశలింగము పంతులుగారును గూడ నీప్రతీతి సత్యమైన దని గ్రహించియున్నారు. కళింగాధీశ యను పాఠ మీ ప్రతీతి కనుగుణము. సర్వవిధముల , నిర్దుష్టము. ఇదియే కవిప్రయుక్తమైన పాఠమై యుండవలయును.

ఈనిర్ణయమువలన భీమకవి నన్నయభట్టునకుఁ బూర్వుఁడను శ్రీరామమూర్తిగారి సిద్ధాంతము పూర్వపక్షమైనది. వీరేశలింగము పంతులుగారివాదమునకుఁ గల యితరప్రమాణముల విమర్శింతము. అవి రెండు. ఏవియన:--

(1) ఉ. చక్కఁదనంబుదీవి యగుసాహిణిమారుఁడు మారుకైవడిం
         బొక్కి పడంగలండు చలమున్ బలమున్ గల యాచళుక్యపుం
         జొక్కనృపాలుఁ డుగ్రుఁడయి చూడ్కులమంటలు రాలఁ జూచినన్
         మిక్కిలి రాజశేఖరునిమీఁదికివచ్చిన రిత్తవోవునే.

అనుచాటువు భీమకవి చెప్పిన ట్లూహించి సాహిణిమారుఁడు ప్రతాపరుద్రునికాలములో నుండినట్లు సోమదేవరాజీయమునఁ జెప్పఁబడియున్నదనియు నందువలన నాతఁడును భీమకవి