పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగద్గురు తత్త్వబోధకస్వామి

59


యింటికి పోవడం ప్రారంభించారు. "ఈకొత్తస్వాములవారు ఎక్కడ నుంచి వచ్చారు? ఇతనిది యేకులం ఈయన సిద్ధాంతా లేమిటి? జీవితవిధానం ఎలాంటిది?" అనే సంగతులన్నీ తెలుసుకొవాలని మధురాపుర జనులలో చాలా మందికి కుతూహలం కలిగింది. హిందూదేశపు స్వాములవార్ల పద్ధతులను నోబిలీ బాగా ఎరిగిన వాడైనందువల్ల మొదట తన యింటినుంచి బయటికి పోలేదు. చూడవచ్చినవారితో చాలా మితభాషణం జరిపేవారు. నొబిలీని చూడడానికి ఎవరైనా వచ్చినప్పుడు "ఇప్పుడు సమయంకాదు. స్వాములవారు సమాధిలో ఉన్నా"రనిగాని, "నిష్ఠలోఉన్నా"రనిగాని ఆయన శిష్యులు చెప్పేవారు. ప్రజలలో కుతూహలం అమితమై పోయినతరువాత - చూడవచ్చినవారు ఒకటిరెండుసార్లు దర్శనంకోసంవచ్చి తిరిగిపోయిన తరవాత నోబిలీ దర్శనం ఇచ్చేవారు. " 'అయ్యరు ' గారితో మాట్లాడడానికి వచ్చామని చూడడానికి వీలౌతుందా" అని వచ్చినవారు అడిగితే చాలాసేపటికిగాని దర్శనం ఇచ్చేవారు కాదు. ఆఖరుకు వారిని లోపలికి రానిచ్చినప్పుడు జేగురురంగుగుడ్డ కప్పివున్న ఎత్తైన ఒక వేదిక మీద ఆయన పద్మాసనం వేసుకొని కూర్చుండి వుండేవాడు. ఆయనముందు అలాంటి కాషాయరంగుబట్ట యింకొకటి పరిచివుండేది. దానికిదగ్గరగా ఒక చాప వుండేది. ఆయనను చూడడానికి వచ్చినవారందరూ చేతులెత్తి ఆయనకు నమస్కరించా లని అక్కడివారు చెప్పేవారు. ఎంత గొప్పవారైనా, రాజోద్యోగులైనా కూడా ఆయనకు అలాగ నమస్కరించేవారు. ఆయనను శిష్యులు కాదలచినవారు ఇలాగ మూడుసార్లు భక్తితో నమస్కరించి సాష్టాంగపడి మ్రొక్కేవారు. ఈ సంగతులను ఫిగోరా (Figuoroo) వ్రాశారు.

     ఈ ఐరోపాదేశపు స్వాములవారివల్ల కొన్ని సంగతులు వినాలని మధుర రాజైన ముద్దు వీరప్పనాయకునికికూడా కుతూహలం కలిగి తన దర్భారులో చాలాసార్లు అన్నాడట. అంతట నోబిలీని బాగా ఎరిగినవారొకరు ఈ సన్యాసి తనకు స్త్రీల ముఖం కనబడుతుందేమోనని తన యిల్లు వదలి బయటకే రాడని అన్నారట! ఒక్కమాటైనా వీధిలో