Jump to content

పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జిల్లా శిరస్తాదారు

19

గిట్టనివాళ్ళందరూ ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పారు. కొత్తగా పిఠాపురం తాశిల్దారుగా ప్రవేశించిన ఆయన ఈ వ్యవహారంలో నరసింగరావుగారికి వ్యతిరేకంగా పనిచేశాడు. నరసింగరావుగారు పిఠాపురం జమీందారీని దగాచేసి అక్రమలాభం పొందే దురుద్దేశంతో కాగితాలు ఫోర్జరీ చేసినట్లున్నూ, లెక్కలను మాపుచేసి నట్లున్నూ, కలెక్టరుగారు నేరాలు మోపి సెషన్సు జడ్జీకోర్టులో విచారణ చేయడానికి ఇతనిని కమిటుచేశాడు. కలెక్టరే మేజెష్ట్రీటు అయివున్నందువల్ల తానే ఫిర్యాదీయున్నూ, నేరారోపకుడున్నూ, (ప్రాసిక్యూటరున్నూ, కమిటింగు మేజస్ట్రీటున్నూ) అయి నేరమునుగురించి చిన్న అక్షరాలతో కొన్ని తావుల వివరణపత్రికను వ్రాసాడు. జమీనుమీద విదుదల చెయ్యవలసిన దని ముద్దాయి కోరిననూ వదలక చెరసాలలోనే వుంచారు. అవమానం కంటె చావు మేలని ఆయన అన్నాడని, వదలిపెడితే ఆత్మహత్యచేసుకుంటాడనే నెపంతో జిల్లాలోకల్లా గొప్ప దేశీయోద్యోగిని ఇలాగ ఖైదులో పడవేసి వుంచారు.

కలెక్టరు రికార్డుల సోదా

ఈ ముద్దాయిపైన మోపిన నేరాలలో శిరస్తాదారుగారిదగ్గర వున్న లెక్కలను బట్టి కనబడే పిఠాపురం జమీందారుగారి చరాస్తి నగలు యావత్తూ స్వాధీనం కాలేదనే సంగతిని యీ శిరస్తాదారు కలెక్టరుగారికి తెలియపరచలే దనేది ఒకటి. తాను మరుగు పరిచినట్లు చెప్పే సంగతులన్నీ మూజువానీగానూ, లిఖిత మూలంగానూకూడా కలెక్టరుగారికి తెలియజేసానని శిరస్తాదారుగారు జిల్లా కోర్టు వారికి మనవి చేశారు. లిఖితమైన జాబితా యేదీ లేదని జిల్లాకలెక్టరుగారు మొదట అన్నారు. జిల్లాకోర్టువారి వుత్తర్వుప్రకారము కలెక్టరుగారి రికార్డులను సోదాచూడగా అలాంటి కాగితం ఒకటి దొరికింది. అంతట శిరస్తాదారు దానిని తనకు ఇచ్చివుండవచ్చునని కలెక్టరుగారు ఒప్పుకొన్నారు. ఈకాగితాన్ని కోర్టువారి కి పంపుతూ జమీందారుగారి ఆబరణాలను గురించి శిరస్తాదారుగారు తనకు తెలిసినా, లెక్కలన్నీ ఆయనదగ్గిర వున్నందువల్ల ప్రత్యక్షంగా కనబడుతూవున్న 67000 రూపాయల