పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

కథలు - గాథలు

వల్ల అక్కడ పని చెయ్యడానికి ప్రత్యేకంగా ఇతణ్ణి ఏరి కోరి నియమించారు. ఈయనపై యధికారి రాజమహేంద్రవరం కలెక్టరు, మొదటి ఏడేళ్లవరకూ ఇతనిని ప్రశంసిస్తూ పైవారికి వ్రాసేవాడు. ఇదివరకు వ్యవహారాలు సరిగా జరగనందువల్ల అధోగతిలో వున్న ఈ జిల్లా రివెన్యూ వసూలు నరసింగరావుగారు అమలులో పెట్టిన మంచి పద్దతులవల్ల ఈ జిల్లా ఆదాయం అభివృద్ధి జెందిందని (డి.సి. డభ్లియు) ఇంజనీరింగుశాఖవారు అంటారుగాని ఈ జిల్లాను గురించి స్వయంగా ఎరిగున్నవా రీమాటను నమ్మరనిన్నీ అక్కడ స్థానికులుగా వున్న ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఈ చిలక పలుకులు పలకడానికి సాహసింపరనిన్నీ స్మాలెట్టు గారు వ్రాశారు.

పిఠాపురం జమీందారీ

పిఠాపురం జమీందారు శ్రీరాజారావు వేంకట కుమార మహీపతి గంగాధరరామారావు బహద్దరుగారి తండ్రిగారైన శ్రీరాజారావు సూర్యారావుగారు సాధారణ నామ సంవత్సర కార్తీక బ (27-11-1850) తేదీన చనిపోయారు. ఆయన కొమాళ్లు చిన్నవాళ్లైనందువల్ల వాళ్లను దొరతనంవారి సంరక్షణకింద 'వార్డులు ' గా వుంచారు. సూర్యారావుగారు చనిపోయిన సంగతి తెలియగానే అప్పటి రాజమహేంద్రవర కలెక్తరున్నూ, ఆయన హెడ్డు శిరస్తాదరున్నూ జమీందారు గారి ఆస్థిని వశపరచుకోడానికి తక్షణమూ పిఠాపురం వెళ్లారు. జమీందారుగారి ముఖ్యబంధువు లెవ్వరూ దీనికి యిష్టపడక కొంత సాత్విక నిరోధం చేసారు.

ఈ పిఠాపురం జమీందారీ చాలా ముఖ్యమైన జమీందారీ. చనిపోయిన రాజాగారి చిన్నతనంలో 12, లేక 14 సంవత్సరాలు కంపెనీ సర్కారు వారి సంరక్షణలో "వార్డు ' గా వున్నారు. జమీందారీని సర్కారువారు చక్కగా వ్యవహరించి నిల్వతో ఆయనకు