పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

133

కథలు - గాథలు

బాదు నగరంలో ఒక సత్రంలో కలరాతగిలి చావడానికి సిద్ధంగా వుండి, ఆ సత్రంలోనే బసచేసిన ఒకపెద్దమనిషిని దగ్గిరకి పిలిచి తానొక రహస్యం చెప్పుకోదలచినా ననిన్ని, తన కోరిక చెల్లించవలసిందనిన్నీ బ్రతిమాలింది. పాపం, ముసలమ్మ అవసానసమయంలో అడుగుతూవుందికదా అని అతడు సరేనన్నాడు. అంతట ఆమె తన మెడలోనుంచి ఒక రక్షరేకును తీసి అతనిచేతిలొ పెట్టి తాను చచ్చిపోగానే ఆ రక్షరేకును తీసుకెళ్లి ముశీనదిలో పారవెయ్యవలసిందని ప్రార్ధించింది. పాపం, ఆపెద్దమనిషి మొదట ఆవిడకోరికను చెల్లిద్దామనే అనుకున్నాడుగాని ఈవింతకోరికను గురించీ, ఆవిడ చూపిన ఆదుర్ధాను గురించీ అతనికి మనస్సులొ కొంచెం అనుమానం తగిలి ఇందులో ఏదో విశేషం వున్నదని తలచి ఆరక్షరేకును హైదరాబాదులో అధికారులకిచ్చాడు. దానిని వారు పరిశీలించగా అది నిజాంప్రభువుగారి సోదరుడు కర్నూలు నవాబుగారికి వ్రాసిన రహస్యపు వుత్తరం అని తేలింది.

జనానాలో ఆయుధాగారము

దీనిని గురించి దర్యాప్తులు చేయగా ఇంగ్లీషు వారిపట్ల ఒక పెద్ద కుట్ర జరుగుతూవున్నట్లు బయలుపడింది. ఇంతేకాదు, కర్నూలుకోటలో కొంత ఆయుధసామగ్రిన్నీ, మందుగుండుసామానున్నూ చేర్చివున్నట్లున్నూ తెలిసింది. అంతట వెంటనే ఒక ఇంగ్లీషు సైనికదళాన్ని కర్నూలుకు పంపి కోటను సోదాచేస్తామని నవాబును అడిగారు, సరే చేసుకోండి అని అతడు ధైర్యంగా జవాబుచెప్పి తన సైనికులతోటి, పరివారంతోటి కోటవెలపల మైదానంలోకి వెళ్లాడు. కర్నూలు నవాబుగారి కోటను తనిఖీ చెయ్యడానికి కమిషనర్లు వెళ్లినపుడు గులాం రసూలుఖానుగారు వారిని చాలా మర్యాద చేశారు. దానిని గురించి వారే ఇలాగ వ్రాశారు. కర్నూలు పట్నంనుంచి కోటద్వారముదాకా వీధులకు రెందుప్రక్కాలా సైనికులు బారులు తీర్చి మాకు జొహారుచేసి గౌరవంచూపారు. మేము దివానుఖానాను సమీపించగానే నవాబుగారు కొంచెముదూరము మా కెదురుగా వచ్చి, మాచేతులు పట్టుకుని ఉచితాసనమిచ్చి గౌరవించాడు. అటు తరువాత