పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

119


'అమరం ' అనే పదము 'అమరనాయంకర ' మనేదాని రూపాంతరము. విజయనగర సామ్రాజ్యంలోని వివిధప్రాంతాలలో గల కోటలకు అధ్యక్షులై దేశాన్ని పరిపాలించే ప్రభువులను అమరనాయకులనేవారు. వీరు రాజోద్యోగులై, దండనాయకులై, దేశపరిపాలకులైన నాయకులు, రాజకీయోద్యోగులలో దొరలు, పారుపత్యగార్లు, రాయసంవారు, అవసరంవారు, రాచకరణాలు అనే వివిధ హొదాలవారు కనపడుతున్నారు. వీరు చేసే వుద్యోగాలయొక్క వివరాలు స్పష్టంగా తెలియకపోయినా వీరు ప్రభుత్వోద్యోగం చేసే రాజసేవకులనిన్నీ, వీరికి జీతబత్తెములు, రాజమర్యాదలు, గ్రామాలు, జమీనులు వుండేవనీ తెలుస్తూంది. రాయలవారు యుద్ధానికి తర్లి వెడుతూ వున్నప్పుడు వీరుకూడా హాజరుగా వుండేవారనిన్నీ తెలుస్తూవుంది. వీరిని గురించి కొన్ని విశేషాలు రాయవాచకము లో వివరింపబడియున్నవి.

విజయనగర సామ్రాజ్యకాలంనాటి దేశచరిత్రను, రాజకీయ ఆర్ధిక సాంఘిక మత పరిస్థితులను గురించి పరిశోధించి శాసనములను స్థానిక చరిత్రలను, కవిలెలను, విదేశయాత్రికుల సాక్ష్యములను పరిశీలించి ఆకాలంలో మన కవులు రచించిన ప్రబంధములలోని వర్ణనలయందు, చరిత్రాంశములయందు గల నిజమును బయటికి తీసి "Studies in the History of the Third Dynasty of Vijayanagara" అనే గొప్ప చరిత్ర గ్రంధమును రచించిన డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య గారీ సంగతుల నన్నింటినీ చక్కగా చర్చించియున్నారు.*[1]

తిమ్మప్పనాయకుడు

గోరంట్లగ్రామంలోని దేవాలయ సేవకులకు గల కొన్ని బాధలను సూరపరాజు అనే ఆయన తీర్చినాడనిన్నీ, ఆయన వాకిటి ఆదెప్ప నాయనిం వారి కార్యకర్త (ఏజంటు) అనిన్నీ, ఈ ఆదెప్పనాయనింవారి తండ్రిపేరు తిమ్మప్పనాయకుడనిన్నీ 1912-వ సంవత్సరపు మద్రాసు ఎపిగ్రాఫికల్ రెపోర్టు 55-వ పేరాలోను, 1912-వ సంవత్సరం 11-వ సంఖ్య శాసనములోను ఉదాహరింపబడినది.

  1. చూ: 4 వ ప్రకరణము, పుటలు 151-153: 5 వ ప్రకరణము, పుటలు 130-1, 179-181.