పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాకిటి కావలి తిమ్మన

115


కాపలావాడివంటి ద్వారపాలకుడు కాడనిన్నీ, రాయలవారిదగ్గర గొప్ప అధికారమూ, పలుకుపడీ కలిగిన వుద్యోగియనిన్నీ, విద్యావంతుడు, రసికుడు అనిన్నీ ఊహించడానికి సావకాశం కనబడుతూ వుంది. ఈ తిమ్మన్నను గూర్చిన విశేషాలను తెలుపగల చరిత్రాధారాలేమైనా వున్నవేమో చూద్దాము.

తిరుపతి దేవస్థానం విచారణకర్తలైన శ్రీ మహంతు ప్రయాగ దాసువారు తిరుపతిక్షేత్రంలో రాజాధిరాజులూ, శ్రీమంతులూ చెక్కించిన శిలాశాసనాలయొక్క విలువను గ్రహించి వాటిని ప్రకటించడానికి నిశ్చయించి వాటిని గురించి ఒక నివేదికను తయారుచేయడానికి బ్రహ్మశ్రీ సాధు సుబ్రహ్మణ్యం బి.ఏ, గారిని నియోగించారు. శాసనసంపుటాలతో పాటు వారి నివేదికనుకూడా ఒక పెద్ధ గ్రంధముగా 1930 లో అచ్చువేయించారు. దీనివల్ల పల్లవులు, చోళులు మొదలైన రాజుల కాలంనాటినుంచి విజయనగర సామ్రాజ్యము నేలిన చక్రవర్తుల వరకూ గల చరిత్రాంశాలు విశేషాలు తెలుస్తున్నవి. అందులో తిమ్మన్న చరిత్రకూడా వున్నది.

"అవసరం" తిమ్మయ్య

తిరుపతి దేవస్థానంలోవున్న శాసనాలవల్ల కృష్ణదేవరాయల వారి కొలువులొ 'అవసరం తిమ్మయ్య ' యనే దండనాయకు డొకడు రాయలవారి 'వాకిటికావలి ' అనగా ద్వారపాలకుల పై అధికారియై యున్నట్లున్నూ, అతడు వేయిమంది సైనికుల కధికారి యనిన్నీ, ఒక చిన్న సంస్థానానము నేలే సామంతమండ లేశ్వరుడనిన్నీ, అతనిని 'అమరం ' తిమ్మరసయ్య, తిమ్మప్ప నాయకుడు అనికూడా పిలిచేవారనిన్నీ, ఆయన రాయలవారి దర్శనం చేయించి అనేక సందర్భాలలో చాలాఉపకారాలు చేసినట్లున్నూ తెలుస్తున్నది.

తిరుపతిలో వున్న దానశాసనాలలో "అవసరం" నరసయ్య, తిమ్మయ్య, నరసయ్యలనే ముగ్గురు అన్నదమ్ముల పేర్లున్నూ, వారితల్లి బసవమ్మగారి పేరున్నూకూడా కనబడుతూ వున్నవి. శా.శ.1434