పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కథలు గాథలు

కామన్సు సభలో సభ్యుడైనాడు. ఆర్కాటు నవాబుగారి పక్షమునవలంబించిన ఇంకా కొందరు దొరలుకూడా అక్కడ చేరారు. పిగట్టుగారి వ్యవహారాన్ని గురించి కామన్సు సభలో చర్చించబడి నప్పుడు వీరందరూ పిగట్టుగారి ప్రత్యర్ధుల చర్యలను సమర్ధించడానికి తంటాలు పడ్డారు గాని అందులోని నిజమంతా కామన్సు సభవారికి విశదమైంది. అంతట ఈస్ట్రాటసుగారున్ను, ఇతని తోడివారున్నూ చేసిన అక్రమాన్ని గుఱించి నేరాన్ని గుఱించీ విచారించి శిక్షించడానికి వీరిపైన ఒక క్రిమినలు కేసు దాఖలు చేయడానికి వుత్తర్వు చేయవలసిన దని కామన్సుసభవారు ఇంగ్లీషు రాజుగారికి విన్నపం చేశారు. ఆప్రకారం స్ట్రాటసు మొదలైన వారిమీద కేసుదాఖలై విచారణ జరుగగా వారినేరం రుజువు అయింది. అయితే వీరు చేసిన ఘోరాన్యాయానికి తగిన శిక్షమాత్రం వీరికి విధించబడలేదు. ఒక్కొకరికి వెయ్యి నవరసులు జుల్మానా మాత్రం విధించి వదిలివేశారు. (History of British Empire - Edward Thornton Vol.11 pp.199-213)

-----

కాశీ మశీదులో శివలింగం

క్రీ.శ. 1823-26 మధ్య కలకత్తాలొ తూర్పు ఇండియావర్తక కంపెనీవారి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధికారిగ నుండి హిందూదేశా మంతా తిరిగి చూసిన బిషప్ హెబరుగారు (Bishop Heber) తమ గ్రంధములో ఒకచిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.

1659-1707 మధ్య హిందూదేశాన్ని పరిపాలించిన ఔరంగజెబుచక్రవర్తి చాలా హిందూదేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ రాళ్ల తోటీ దూలాలతోటీ నిర్మింపబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.