పుట:Kathalu gaathalu modati bhaagamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెన్నపట్నం గవర్నరు దుర్గతి

93


విధాలుగా సొమ్ము పిండుతూవుంటే నవాబుకి ఎంతసొమ్మైతే చాలుతుంది గనక? అందుకోసం అతడు అప్పులపాలు కావలసివచ్చినది.

నవాబు తనవసరంకొద్దీ ఎక్కువ వడ్డీలకు ఋణపత్రాలు వ్రాసి యిచ్చేవాడు. కొందఱు ప్రబుద్ధులు అతనిని మోసగించి, బలవంతపెట్టి నూటికి 24 మొదలు 48 వంతుల చొప్పున అత్యధికమైన వడ్డీలువేసి ప్రతిఫల శూన్యంగాకూడా కొన్ని ఋణపత్రాలు వ్రాయించుకున్నారు. ఇలాగ వ్రాయించుకొన్న ఋణపత్రాల తాలూకు సొమ్ము వెంటనే ఇవ్వవలసిందని బలవంతపెట్టి యివ్వకపోతే కంపెనీ అధికారులకుచెప్పి తగిన శాస్తి చేయిస్తామని బెదరించి అందుక్రింద అతని రాజ్యభాగాలను స్వాధీనతాకట్లు వ్రాయించుకొనిన్నీ, సిస్తులవసూళ్ళ యిజారా హక్కులను పొందిన్నీ, అతనిరాజ్యంలో ప్రవేశించి, శిస్తులవసూళ్లలో రైతులను బాధించడం ప్రారంభించారు. ఈపత్రాలను దొరలు బాహాటంగా బజారులోపెట్టి క్రయ విక్రయాలు చెయ్యడం ప్రారంభించారు. ఆ కాలంలో చెన్నపట్నంలో ఇంగ్లీషు వర్తక కంపెనీవారి కొలువులో పనిచేసే గొప్ప అధికారులైన దొరలలో చాలమంది ఇలాంటి పత్రాలు వ్రాయించుకొని యీ యన్యాయాలలో భాగస్వాములై ఉన్నందువల్ల ఆర్కాటునవాబు ఋణపత్రాల మార్పిడి ఒక పెద్దవ్యాపారంగా సాగింది.

చెన్నపట్నం గవర్నరు కార్యాలోచనసభలో వ్యవహారాలన్నీ అధికసంఖ్యాక సభ్యుల అభిప్రాయాన్ని బట్టి జరగాలనే నియమం ఒకటి యున్నందువల్ల ఈ నవాబుగారి బాకీదారులు కార్యాలోచన సభ్యులకు లంచాలిచ్చీ, భాగాలిచ్చీ వారిని లోబర్చుకొని తమకు కావలసిన అధికారాలను, ఉత్తర్వులనూ సంపాదించేవారు. అందువల్ల కంపెనీ ఉద్యోగులలో ఎవరైనా ఈ అన్యాయానికి అంగీకరించక వాటిని ప్రతిఘటిస్తే తక్కినవారందఱూ వేటకుక్కలలాగ అతనిమీదపడి బాధించేవారు. అందువల్ల ఎవ్వరూ ఈ యన్యాయాన్ని అరికట్టలేకపోయేవారు. కొంత మంది గవర్నర్లు కూడా ఈ యన్యాయపువ్యవహారాలలో భాగస్వాములైనట్లు కంపెనీరికార్డులవల్ల కనబడుతూ వున్నది.