పుట:Kasiyatracharitr020670mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందువల్ల మరికొందరున్ను అన్నదానమందు ప్రవర్తింపుచు వచ్చిరి. మరిన్ని గంజిదొడ్డి యనే అన్నసత్రములో గవర్నమెంటు వారు అపార ద్రవ్యమును బదల అన్నదాంవిషయమై ఖర్చుచేసినప్పుడు అయ్యగారు ఆ ధర్మవిచారణ ప్రభువులలో తాను వొక్కడుగనుండి పేదలకు కాలములొ విమర్శగా అన్నమును అందచేసేకొరకై పడిన శ్రమ చెప్ప శక్యముకాదు. అది యేలాగంటే 1000 2000 తూముల బియ్యమును ప్రతిదినమున్ను పాకముచేయించి తన దృష్టిపధములో పేదలను శ్రమపడనీయకుండా రెండుజాములకు లోగానే అన్న మంతయు వినియోగపరచుచు వచ్చిరి. మరిన్ని తన బుద్ధి శక్తిని యావత్తున్ను రాత్రిన్ని పగలున్ను ఆ కార్య విషయమై వాడుచు వచ్చిరి.

ఇదిగాక అయ్యవారి నాతో ఒక ప్రస్తానములో చెప్పియుండే యొక సంగతి మిక్కిలి ప్రయోజనకారిగా తొచినందున యీ అడుగున వ్రాయుచున్నారు. వొక పురుషుడు విస్తరించి ద్రవ్యము నార్జించిపెట్టి తాను సద్వ్రయము చేయకుండా చనిపొవుట నిష్ఫలమని యున్ను చనిపోవువారు తమకు పిమ్మట జరగవలసిన కార్యములను వ్రాసే మరణశాసనములు అనేకముగా తన వుద్యోగమును పట్టి ట్రాం సు లేషన్ చేయవలసి వచ్చి నందున ఆ వ్రాసినవారి తాత్పర్యములనున్ను వారి జీవించి యుండగా చేయుచు వచ్చిన కృత్యములనున్ను వారికి యీలోకవిషయమై యుండిన తాత్పర్యములనున్ను వారు వ్రాసిన మరణశాసనములు వారి మరణానంతరము ఆ తాత్పర్యానకు సంబంధించకపొవుటనున్ను వారు స్వఫ్నావస్థలో గూడా చూడనివిగానున్ను యెట్టి బుద్ధిమంతులకున్ను యీలాగు సంభవించు నని ఊ హించ కూడనివిగానున్ను వుండే అనేక విషయములు సంభవించడమునున్ను తాను తెలుసుకొన్నందున తన మనసుకు లోకరీతి బాగా తెలిసి పరలోకదృష్టి ప్రబల మవుచు వచ్చినదని చెప్పినారు.